
ప్రతిఒక్కరి జీవితంలో 40వ దశకం చాలా కీలకమైంది. ఉద్యోగాలు చేస్తున్నవారికైతే అదో ముఖ్యమైన దశ. 40 ఏళ్లు దాటాయంటే ఉద్యోగాల్లో అప్పటికే ఎంతో అనుభవం సంపాదించి ఉంటారు. అధిక జీతభత్యాలు, పదోన్నతులు అందుకునే అత్యంత కీలకమైన దశ అది. అయితే లేఆఫ్స్ విస్తృతమైన నేటి కార్పొరేట్ వాతావరణంలో నలభైలలో ఉన్న ఉద్యోగులే తొలగింపులకు తొలి లక్ష్యంగా మారుతున్నారు.
ఈ ధోరణిపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పుల ఈఎంఐలు ఇలా సవా లక్ష ఆర్థిక భారాలను నలభైలలోకి అడుగుపెట్టిన ఉద్యోగులు మోస్తున్నారని దేశ్పాండే ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. ఇంతటి సమస్యలతో నెట్టుకొస్తున్న వీరినే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది కుదింపు సందర్భాల్లో మొదట నలభైలలోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అప్రమత్తం చేశారు.
పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశ్ పాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. కృత్రిమ మేధపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పొదుపు ఎక్కువగా చేయాలని,
వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. శంతను దేశ్ పాండే వ్యాఖ్యలకు ఆన్లైన్లో మిశ్రమ ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి. చాలా మంది తమ వ్యక్తిగత దృక్పథాలను పంచుకున్నారు.