ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం! | Driving Between 9 PM and 10 PM Its the Most Dangerous Hour in India Report | Sakshi
Sakshi News home page

ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం!

Jun 26 2026 2:56 PM | Updated on Jun 26 2026 3:08 PM

Driving Between 9 PM and 10 PM Its the Most Dangerous Hour in India Report

భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని జూనో జనరల్ ఇన్సూరెన్స్ వారి 'ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (IRSR) 2026' దేశంలోని డ్రైవింగ్ అలవాట్లపై కీలకమైన విషయాలను వెల్లడించింది.

జూనో స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన మొత్తం సమాచారం.. 17 రాష్ట్రాల్లో 45 లక్షల ప్రయాణాలు, 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటా ఆధారంగా రూపొందించారు.

ఈ నివేదిక ప్రకారం.. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య వాహనం నడపడం రోజులో అత్యంత ప్రమాదకరమైన సమయం. ఎందుకంటే రాత్రి 8 గంటల తర్వాత డ్రైవింగ్ నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. అయితే.. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య డ్రైవింగ్ చేయడం అత్యంత సురక్షితమైన సమయంగా గుర్తించారు.

ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వయస్సు లేదా లింగం కాదు, డ్రైవింగ్ ప్రవర్తనే. భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 80 శాతానికి పైగా ప్రమాదాలు డ్రైవింగ్ అలవాట్ల వల్లే సంభవిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

మహిళలు పురుషుల కంటే తక్కువ నైపుణ్యంతో డ్రైవ్ చేస్తారనే అభిప్రాయాన్ని ఈ నివేదిక పూర్తిగా ఖండించింది. మహిళల సగటు డ్రైవింగ్ స్కోర్ 92.86 కాగా, పురుషుల స్కోర్ 92.43గా నమోదైంది. అంటే.. ఇద్దరి మధ్య భద్రత పరంగా పెద్దగా తేడా లేదని ఈ అధ్యయనం వెల్లడించింది.

భారతీయ డ్రైవర్లలో ప్రధాన బలహీనతలు ఆకస్మికంగా బ్రేక్ వేయడం, హఠాత్తుగా వేగం పెంచడం అని నివేదిక తెలిపింది. ఈ అంశాల్లో డ్రైవర్లు తక్కువ స్కోర్లు సాధించారు. అయితే వర్షాకాలం లేదా చలికాలం వంటి వాతావరణ మార్పులు డ్రైవింగ్ స్కోర్లపై పెద్దగా ప్రభావం చూపలేదని కూడా అధ్యయనం పేర్కొంది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు మరణాల్లో దాదాపు 11 శాతం. ఈ ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల కారణంగా భారత జీడీపీలో 3 నుంచి 5 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది.

రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా నష్టపోతున్నవారు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు. మొత్తం మరణాల్లో 44 శాతం ద్విచక్ర వాహనదారులు, 19 శాతం పాదచారులు ఉన్నారు.

భారతదేశంలో 2030 నాటికి రోడ్డు ప్రమాదాల మరణాలను 50 శాతం తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రహదారుల నిర్మాణం మాత్రమే సరిపోదని, డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి సాంకేతికత ఆధారిత పరిష్కారాలు అవసరమని జునో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ షనాయ్ ఘోష్ అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement