
వేసవికాలంలో ఎండలు మండిపోతుంటాయి. ఇంట్లో కరెంటు బిల్లులు భారీగానే వస్తుంటాయి. ఉక్కపోత తాలలేక ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకం పెరుగుతుంది. దాంతో విద్యుత్తు బిల్లులు పెరుగుతాయి. సామాన్యులకైతే ఈ బిల్లులు రూ.వందల్లోనో లేదా మహాఅయితే రూ.వేలల్లోనో ఉంటాయి కదా. ఓ వ్యక్తి ఇంటికి ఏకంగా రూ.70 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. అయితే దానికి ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా గుర్తింపు ఉంది. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిదో తెలుసా? ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీది. ముంబయిలోని తన నివాసం ‘అంటిలియా’ ఇటీవల నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.70,69,488గా ఉందని కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ నెల బిల్లుతో ఒక కుటుంబం జీవితాంతం ఓ మోస్తారుగా జీవనంగా సాగించవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సకాలంలో బిల్లు చెల్లిస్తుండడంతో అంబానీకి రూ.48,354 డిస్కౌంట్ కూడా లభించిందని రిపోర్ట్లు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: గిగ్ వర్క్ర్ల సంక్షేమానికి సెస్
అంటిలియా ప్రత్యేకతలు..
ముంబైలోని అల్టామౌంట్ రోడ్డులో 27 అంతస్తులతో ఈ అంటిలియాను నిర్మించారు.
ఈ భవనం సుమారు 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
50 సీట్ల థియేటర్, బహుళ స్విమ్మింగ్ పూల్స్, ఒక స్పా, ఆలయం, మరియు కృత్రిమ మంచుకొండల నుంచి మంచు కురిసేలా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
ఇందులో 168 కార్లు నిలిపే గ్యారేజీ ఉంది.
మూడు హెలిప్యాడ్లు ఉన్నాయి.
అమెరికన్ ఆర్కిటెక్చర్ సంస్థ పెర్కిన్స్ & విల్ దీన్ని రూపొందించింది.
2006-2010 మధ్య నిర్మించిన ఈ భవనానికి ఆ సమయంలోనే సుమారు 2 బిలియన్ డాలర్లు(సుమారు రూ.15,000 కోట్లు) వ్యయం అయిందని అంచనా.
రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ నివాసాన్ని రూపొందించారు.