రూ.33,660 కోట్లతో 100 ప్లగ్–అండ్–ప్లే పార్కుల అభివృద్ధి
తొలి దశలో 50 పార్కులకు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనల ఆహ్వానం
న్యూఢిల్లీ: దేశీయ తయారీ (ఉత్పాదక) రంగానికి ఊతమివ్వడం, ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ.33,660 కోట్లతో చేపట్టిన ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన’ (భవ్య) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. తొలి దశలో 50 ‘ప్లగ్ అండ్ ప్లే’ ఇండ్రస్టియల్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నాలుగు నెలల వ్యవధిలో ప్రతిపాదనలు ఆహా్వనిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ ఆధారిత ‘ఛాలెంజ్ మోడ్’ విధానంలో తొలి రెండు నెలల్లో 20, తదుపరి రెండు నెలల్లో మరో 30 పార్కులను ఎంపిక చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) నుంచి ఆరేళ్ల కాలవ్యవధిలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో దేశవ్యాప్తంగా మొత్తం 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నారు.
100–1000 ఎకరాల విస్తీర్ణంలో (కొండ ప్రాంత రాష్ట్రాల్లో అయితే 25 ఎకరాలు) ఏర్పాటు చేసే గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టులకు మౌలిక వసతుల కల్పన కోసం ఎకరానికి గరిష్టంగా రూ.1 కోటి వరకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది.
అదే ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడిన ప్రాజెక్టులకైతే ఎకరానికి రూ.50 లక్షల వరకు సాయం అందుతుంది. భూమి, నీరు, విద్యుత్ లభ్యతతో పాటు మల్టీమోడల్ కనెక్టివిటీ, డిజిటల్ సింగిల్ విండో క్లియరెన్స్ వంటి సదుపాయాల ఆధారంగానే రాష్ట్రాల ప్రతిపాదనలను పరిశీలిస్తారు. క్లస్టర్ ఆధారిత అభివృద్ధితో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, గ్లోబల్ ఇన్వెస్టర్లకు ‘రెడీ–టు–యూస్’ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ అందుబాటులోకి రానుండగా, ఈ పథకం ద్వారా దేశంలో 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది.
రూపాయి విలువపై ప్రభుత్వం జోక్యం చేసుకోదు: పీయూష్ గోయల్
ఫారెక్స్ (విదేశీ మారి్పడి) రేట్ల నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రం జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రూపాయి విలువ అనేది అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ శక్తులు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో డాలర్తో పోలిస్తే రూపాయి గణనీయంగా బలపడిందని, ఇవన్నీ మార్కెట్ ఆధారిత మార్పులేనని వివరించారు. ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతులపై ఆధారాధారపడటాన్ని తగ్గించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు), ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలు దేశ పారిశ్రామికీకరణకు ఎంతగానో దోహదపడతాయని గోయల్ పేర్కొన్నారు.


