
అధిక ధరలు మార్కెట్ అస్థిరతకు కారణం అవుతుండడంతో చైనా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగం ఒడిదొడుకులకు లోనవుతోంది. దాంతో చైనా ఈవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బీవైడీ ధరల తగ్గింపు నిర్ణయాలు చేపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది మార్కెట్ స్థిరత్వం, పోటీతత్వంపై ఆందోళనలను రేకెత్తిస్తుంది. ఇదిలాఉండగా, చైనా ప్రభుత్వం రంగంలోకి దిగి స్థానిక కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించాలని, తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవద్దని కోరింది.
ధరల యుద్ధానికి మూలం
ఈ పరిణామాలకు కారణం డిమాండ్ కంటే అధిక సరఫరా ఉండడమేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనా తయారీదారులు మార్కెట్లోని డిమాండ్ కంటే చాలా ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. డిమాండ్ తగ్గడంతో కంపెనీలు అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దాంతో చేసేదేమిలేక ధరల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనివల్ల ప్రధాన బ్రాండ్ల లాభాల మార్జిన్లు తగ్గుతాయని, చిన్న కంపెనీలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీవైడీ మే చివరి నుంచి ఇప్పటివరకు 21.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది.
ప్రభుత్వ జోక్యం
మితిమీరిన రాయితీల వల్ల ‘మేడ్-ఇన్-చైనా’ ఎలక్ట్రిక్ వాహనాల దీర్ఘకాలిక ప్రతిష్ఠ మసకబారుతుందని అధికారులు భయపడుతున్నారు. భారీగా ధరల తగ్గింపు వల్ల చైనా బ్రాండ్ విశ్వసనీయత దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇది వినియోగదారులు ఉత్పత్తుల నాణ్యత, విలువను ప్రశ్నించేలా చేస్తుంది. దీన్ని పరిష్కరించడానికి చైనా ప్రభుత్వం వాహన తయారీదారులకు ధరల క్రమశిక్షణను పాటించాలని పిలుపునిచ్చింది. పరిశ్రమను దెబ్బతీసే పద్ధతులను నివారించాలని కోరింది. తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవద్దని వేడుకుంది.
ఇదీ చదవండి: బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతు
ఎగుమతులపై ప్రభావం
దేశీయ సవాళ్లకు అతీతంగా చైనీస్ ఈవీ తయారీదారులు గ్లోబల్ మార్కెట్లలో దూకుడుగా విస్తరిస్తున్నారు. అయితే స్వదేశంలో అస్తవ్యస్తమైన సప్లై-చెయిన్ వల్ల ఏర్పడిన ధరల యుద్ధం విదేశాల్లో విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ పట్టును కోరుకునే కంపెనీలు పోటీ ధరలతో స్థిరమైన లాభదాయకతను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యాన్ని పాశ్చాత్య దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.