మోదీ సర్కార్‌ అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!

Central Govt To Miss Its Revised Disinvestment Target This Year - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(2021–22)కి పెట్టుకున్న డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వం విఫలమయ్యే అవకాశముంది. వెరసి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 తదుపరి రెండోసారి టార్గెట్‌ను అందుకోవడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీలో 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.60,000 కోట్లకుపైగా సమకూర్చుకోవాలని తొలుత భావించింది. అయితే రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం, ఫెడ్‌ వడ్డీ పెంపు ఆందోళనలు మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. దీంతో ఈ మార్చిలోగా ఎల్‌ఐసీ లిస్టింగ్‌ సాధ్యపడకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో సవరించిన డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం రూ.75,000 కోట్లను అందుకోవడంలో ప్రభుత్వం మళ్లీ మిస్‌ అయ్యే అవకాశముంది. ఇంతక్రితం 2019–20లో సీపీఎస్‌ఈ డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం రూ.65,000 కోట్ల సమీకరణను ఆశించగా.. రూ.50,304 కోట్లతో సరిపుచ్చుకుంది. 

కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.12,400 కోట్లు మాత్రమే సమీకరించింది. దీంతో ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వం భారీగా వెనకబడే అవకాశముంది. ఇక 2015–16లో సవరించిన అంచనాలు రూ.25,313 కోట్లుకాగా.. రూ.42,132 కోట్లను సమకూర్చుకుంది. ఇదేవిధంగా 2017–18లోనూ ప్రభుత్వం రూ. లక్ష కోట్లను సాధించడం ద్వారా సవరించిన అంచనాలను దాదాపు అందుకోవడం గమనార్హం!

చదవండి: ఎల్‌ఐసీ ఐపీవో వాయిదా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top