
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) త్వరలో ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఫ్లాష్ సేల్ ద్వారా వినియోగదారులకు ఉచిత డేటా, బ్రాడ్ బ్యాండ్ డీల్స్ లేదా డిస్కౌంట్లు లభించనున్నాయి. దేశంలో ఇటీవలే 5జీ సేవలను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్ కార్డుల డోర్ డెలివరీని కూడా ప్రారంభించింది. తాజాగా వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు త్వరలో బీఎస్ఎన్ఎల్ఫ్లాష్ సేల్ ఉంటుందని ప్రకటించింది.
బీఎస్ఎన్ఎల్ ఫ్లాష్ సేల్ వివరాలు
ఫ్లాష్ సేల్ గురించి బీఎస్ఎన్ఎల్ ఎక్స్ (ట్విట్టర్) లో టీజర్ను పోస్ట్ చేసింది. దానితో పాటు ఉన్న వీడియో క్లిప్ ఇలా ఉంది.. "ఏదో పెద్దది ల్యాండ్ కాబోతోంది! ఊహించని అనుభూతిని అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అయితే ఫ్లాష్ సేల్ తేదీని మాత్రం వెల్లడించకుండా త్వరలోనే రానుందని పేర్కొంది. సేల్ సమయంలో ఎలాంటి ఆఫర్లు ఉంటాయో ఊహించండి అంటూ టీజ్ చేసింది. టీజర్ ప్రకారం బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఉచిత డేటా, బ్రాడ్ బ్యాండ్ డీల్స్ లేదా భారీ డిస్కౌంట్లు లభించవచ్చు.
వేగంగా వినియోగదారులను కోల్పోతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ ఫ్లాష్ సేల్ చేపడుతుండటం గమనార్హం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన టెలికాం సబ్స్క్రిప్షన్ డేటా ప్రకారం ఏప్రిల్లో బీఎస్ఎన్ఎల్ మొత్తం 2 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ఇదే కాలంలో యాక్టివ్ బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1.8 మిలియన్లు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.