
రేర్ ఎర్త్ లోహాల (ఆర్ఈఈ) రీసైక్లింగ్ సామర్థ్యాలను వచ్చే ఏడాది, రెండేళ్ల వ్యవధిలో 30,000 టన్నులకు పెంచుకోవాలని ఈ–వేస్ట్ రీసైక్లింగ్ కంపెనీ అటెరో నిర్దేశించుకుంది. ఇందుకోసం రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు సంస్థ సీఈవో నితిన్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి 300 టన్నుల సామర్థ్యం ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్, ఇతర టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కీలకంగా ఉంటాయి. నియోడైమియం, ప్రసియోడైమియం, డిస్ప్రోజియంలాంటి అరుదైన ఖనిజాల వెలికితీతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు గుప్తా వివరించారు.
ఇదీ చదవండి: బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తు
కీలకమైన ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా భారత్ స్వయం సమృద్ధి సాధించాలనేది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆర్ఈఈ మార్కెట్ 2029 నాటికి ఆర్ఈఈ మార్కెట్ ఏటా 12.6 శాతం వార్షిక వృద్ధితో 10.9 బిలియన్ డాలర్లకు చేరుతుందని, ఆర్ఈఈ మ్యాగ్నెట్ల మార్కెట్ 2033 నాటికి 30.3 బిలియన్ డాలర్ల స్థాయిని దాటొచ్చని అంచనాలు నెలకొన్నాయి. అటెరోకి 46 గ్లోబల్ పేటెంట్లు ఉన్నాయి. అమెరికా, యూరప్లో కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉంది.