ఈవీల కోసం కేంద్రం మరో కొత్త స్కీమ్‌ | India Rs 1500 Crore EV Battery Recycling Scheme Boost Electric Vehicles | Sakshi
Sakshi News home page

ఈవీల కోసం కేంద్రం మరో కొత్త స్కీమ్‌

Jun 18 2026 8:09 AM | Updated on Jun 18 2026 11:29 AM

India Rs 1500 Crore EV Battery Recycling Scheme Boost Electric Vehicles

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన ఖనిజాలను డెడ్‌ అయిపోయిన బ్యాటరీలు, ఈ-వ్యర్థాలు, జీవితకాలం ముగిసిన వాహనాల నుంచి రీసైకిల్‌ చేసేందుకు రూ.1,500 కోట్ల విలువైన ‘క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్’ను అమలు చేయనున్నట్లు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన బ్యాటరీ సమ్మెట్‌ 2026 సదస్సులో ఈ ప్రకటన చేశారు. ఈ పథకం జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)లో భాగంగా అమలవుతుంది.

ప్రస్తుతం భారత్‌లో ఈవీలు, పవర్‌ స్టోరేజ్‌ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ తయారీ వేగంగా విస్తరిస్తుండటంతో లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2022లో సుమారు 20 గిగావాట్-గంటల (GWh) స్థాయిలో ఉన్న డిమాండ్ 2030 నాటికి 220 GWhకు చేరే అవకాశం ఉంది. దీంతో దిగుమతి బ్యాటరీ పదార్థాలపై ఆధారపడటం కూడా గణనీయంగా పెరిగింది.

ఈ నేపథ్యంలో పాత బ్యాటరీల నుంచి విలువైన ఖనిజాలను రీసైకిల్‌ చేయడం ద్వారా దేశీయ సరఫరా గొలుసును బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రీసైక్లింగ్ యూనిట్లకు మూలధన (Capex), కార్యకలాపాల (Opex) సబ్సిడీలు అందించేలా పథకాన్ని రూపొందించారు. ముఖ్యంగా ఖనిజాలను నిజంగా వెలికితీసే రీసైక్లింగ్ సంస్థలకే ప్రోత్సాహకాలు లభిస్తాయి.

ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పథకం ద్వారా కనీసం 270 కిలోటన్నుల వార్షిక రీసైక్లింగ్ సామర్థ్యం ఏర్పడి, దాదాపు 40 కిలోటన్నుల కీలక ఖనిజాల ఉత్పత్తి సాధ్యమవుతుంది. అలాగే సుమారు రూ.8,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు దాదాపు 70 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.

ఇదే సమయంలో కీలక ఖనిజాల రంగంలో దేశీయ సామర్థ్యాలను పెంచేందుకు నాలుగు క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పార్కులు, తొమ్మిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రణాళికలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. మరోవైపు అర్జెంటీనా సహా విదేశాల్లో లిథియం నిక్షేపాల కొనుగోలు, దేశీయ అన్వేషణ ప్రాజెక్టులు, ఖనిజ బ్లాకుల వేలం వంటి చర్యల ద్వారా దీర్ఘకాలిక సరఫరా భద్రతపై దృష్టి సారిస్తోంది.

ఈ చర్యలు భారత ఈవీ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాల భద్రతను పెంచడమే కాకుండా, చైనా వంటి దేశాలపై ఉన్న ఆధారాన్ని క్రమంగా తగ్గించి ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి తోడ్పడతాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న ఈవీ మార్కెట్‌కు స్థిరమైన, తక్కువ వ్యయంతో కూడిన బ్యాటరీ సరఫరా వ్యవస్థను నిర్మించడంలో ఈ పథకం కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement