భారతీయులకు బంగారం కేవలం ఒక లోహం కాదు... అదొక సెంటిమెంట్, సంస్కృతి, సంపద. అయితే, ఇళ్లల్లో, దేవాలయాల ట్రస్టుల్లో నిరుపయోగంగా పడి ఉన్న పసిడిని కేవలం ఆస్తిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఆర్థిక వనరుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం కంటే దేశీయంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేసుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం భారతదేశంలోని గృహాలు, ఆలయ ట్రస్టుల వద్ద సుమారు 30,000 టన్నులకు పైగా నిరుపయోగ బంగారం ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో గోల్డ్ రీసైక్లింగ్ అనేది రూపాయి విలువను స్థిరపరచడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి, దాగి ఉన్న సంపదను వెలికితీయడానికి ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారుతోంది.
గోల్డ్ రీసైక్లింగ్ ఎందుకు కీలకం?
మన దేశ ఆర్థిక, పర్యావరణ రక్షణలో గోల్డ్ రీసైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన ప్రయోజనాలు ఇవే..
ఆర్థిక స్థిరత్వం: ఏటా పసిడి దిగుమతుల కోసం భారతదేశం బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. రీసైక్లింగ్ పెరిగితే ఈ దిగుమతుల భారం తగ్గి దేశ కరెంట్ ఖాతా లోటు అదుపులోకి వస్తుంది. ఫలితంగా రూపాయి మరింత బలపడుతుంది.
పర్యావరణ బాధ్యత: కొత్తగా గనుల నుంచి బంగారాన్ని వెలికితీయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అదే పాత బంగారాన్ని రీసైకిల్ చేయడం వల్ల భూగర్భ వనరుల తవ్వకాలు తగ్గి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
ఆర్థిక సమగ్రత: కష్టకాలంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత ఆభరణాలను సులభంగా, పారదర్శకంగా నగదుగా మార్చుకునేందుకు ఇది దోహదపడుతుంది.
వ్యవస్థీకృత రంగం వైపు..
గతంలో పాత బంగారాన్ని విక్రయించాలంటే అన్-ఆర్గనైజ్డ్ (అవ్యవస్థీకృత) రంగంపైనే ఎక్కువగా ఆధారపడేవారు. అక్కడ మోసాలు, తక్కువ ధరకు వస్తుందనే సాకుతో చాలా సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా జూన్ 2026 నాటికి అందుతున్న నివేదికల ప్రకారం.. ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ సంస్థల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ముత్తూట్ గోల్డ్ పాయింట్: ముత్తూట్ ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ‘ముత్తూట్ గోల్డ్ పాయింట్’ దేశంలోనే మొట్టమొదటి జాతీయ స్థాయి వ్యవస్థీకృత గోల్డ్ రీసైక్లింగ్ నెట్వర్క్గా అవతరించింది. ఇక్కడ అత్యాధునిక ఎక్స్-రే ఫ్లోరోసెన్స్ సాంకేతికతతో బంగారం స్వచ్ఛతను పారదర్శకంగా గుర్తిస్తారు. కస్టమర్లకు గరిష్ట విలువను కట్టి తక్షణమే నగదు లేదా బ్యాంక్ బదిలీ ద్వారా సొమ్ము చెల్లిస్తారు. సేకరించిన బంగారాన్ని 995 స్వచ్ఛత కలిగిన బిస్కెట్లుగా మార్చి దేశీయ జ్యువెలరీ తయారీ రంగానికి అందిస్తారు. తద్వారా దేశీయ సరఫరా గొలుసు బలోపేతమవుతోంది.
ఒనిక్స్ మెటల్స్: అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విలువైన లోహాల పునరుత్పత్తిలో ‘ఒనిక్స్ మెటల్స్’ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పారిశ్రామిక రీసైక్లింగ్, ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) రికవరీ రంగాల్లో పని చేస్తూ.. స్థిరమైన పర్యావరణ వృద్ధికి, సర్క్యులర్ ఎకానమీ విధానాలకు ఈ సంస్థ పెద్దపీట వేస్తోంది.
స్కై గోల్డ్ అండ్ డైమండ్స్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ స్కై గోల్డ్ అండ్ డైమండ్స్.. వ్యవస్థీకృత రీసైక్లింగ్కు మద్దతిస్తూ పాత లేదా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని అధికారిక మార్గాల ద్వారా రీసైకిల్ చేయడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. యువత సంప్రదాయ ధోరణులను పక్కనబెట్టి, ఇంట్లో ఊరికే పడి ఉండే లేదా వారసత్వంగా వచ్చిన అదనపు బంగారాన్ని అధికారిక మార్గాల ద్వారా విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఈ రీసైక్లింగ్ అనేది ఎక్కువగా వివాహాలు, ఆర్థిక అవసరాలు లేదా మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరినప్పుడు మాత్రమే జరుగుతోందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్!


