కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్‌! | RBI Holds Repo Rate Policy Review Amid Global Uncertainty: Sanjay Malhotra | Sakshi
Sakshi News home page

కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్‌!

Jun 5 2026 10:06 AM | Updated on Jun 5 2026 10:34 AM

RBI Holds Repo Rate Policy Review Amid Global Uncertainty: Sanjay Malhotra

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం జూన్‌ 3 నుంచి 5 వరకు జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది రెండో విధాన సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

2025-26 ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ.. గడిచిన రెండు సమావేశాలతోపాటు ఈసారీ రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడుసార్లు రేట్లలో కోత విధించింది. దాంతో మొత్తంగా 125 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటు ప్రస్తుతం 5.25గా ఉంది.

ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశంలోని ముఖ్యాంశాలు..

  • పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా దేశీయ ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

  • అంతర్జాతీయ సంఘర్షణల ప్రభావాలను తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ ముందుకుసాగుతోంది.

  • ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్నప్పటికీ వ్యయ ఒత్తిళ్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

  • ఇంధన, ఇతర ఇన్‌పుట్‌ ధరల పెరుగుదల, అంతర్జాతీయ సరఫరా గొలుసు అంతరాయాలు భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలపై భారం చూపే అవకాశం ఉంది.

  • అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయ ధరలపై వాటి ప్రభావం పరిమితంగా ఉండటం వల్ల సీపీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే తక్కువగానే నమోదైంది.

  • 2027 ఆర్థిక సంవత్సరానికి భారత ద్రవ్యోల్బణం 5.1%గా ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.

  • ఇందుకు కమర్షియల్ ఎల్‌పీజీ, బేస్ మెటల్స్, ప్లాస్టిక్, రబ్బరు.. వంటి కీలక వస్తువుల ధరలు పెరగడమే దీనికి కారణం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల సాధారణ కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గుతుందని గవర్నర్ అన్నారు.

  • భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఆర్‌బీఐ గతంలో ఉన్న 6.9% నుంచి 6.6%కి తగ్గించింది. 2027 ఆర్థిక సంవత్సరం త్రైమాసికాల వారీగా అంచనాలు ఇలా ఉన్నాయి.

త్రైమాసికంజీడీపీ వృద్ధి అంచనా
Q1 (మొదటి త్రైమాసికం)6.6%
Q2 (రెండో త్రైమాసికం)6.3%
Q3 (మూడో త్రైమాసికం)6.5%
Q4 (నాలుగో త్రైమాసికం)6.8%

పట్టణ వినియోగం

  • ద్రవ్యోల్బణం భారం ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వినియోగం స్థిరంగా సాగడానికి కొన్ని సానుకూల అంశాలు తోడ్పడతాయని గవర్నర్ పేర్కొన్నారు.

-సేవల రంగంలో కనిపిస్తున్న నిరంతర వృద్ధి.

-జీఎస్టీ హేతుబద్ధీకరణ వల్ల వస్తున్న సానుకూల మార్పులు.

-మార్కెట్లో స్థిరంగా ఉన్న ఉపాధి అవకాశాలు ఇందుకు దోహదపడుతాయన్నారు.

ఇదీ చదవండి: ‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’

Advertisement
 
Advertisement
Advertisement