భారతదేశంలో వ్యవసాయ రంగం అనిశ్చితి, వాతావరణ మార్పులు, సరైన సమాచార లేమి వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫామ్ సెంటర్స్ కోసం అగ్రిటెక్ ప్లాట్ఫామ్ ‘ఆర్య.ఏజీ’(Arya.ag)ను ఓ ప్రైవేట్ సంస్థ ఆవిష్కరించింది. ఈ సెంటర్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా టెక్నాలజీల సాయంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తమ నిర్ణయాలను మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుంది.
ఆర్య.ఏజీ స్మార్ట్ ఫామ్ సెంటర్స్ ఫీచర్లు
ఆర్య.ఏజీ స్మార్ట్ ఫామ్ సెంటర్స్ కేవలం ఒక టూల్గానే కాకుండా వ్యవసాయానికి సంబంధించిన పూర్తి పరిష్కారాలను అందించే ఒక లోకల్ హబ్గా పనిచేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఐఓటీ ఆధారిత మట్టి విశ్లేషణ
నియోపర్క్ సెన్సార్ల వంటి సాంకేతికతను ఉపయోగించి వేగవంతమైన మట్టి పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల సాంప్రదాయ ల్యాబ్ పరీక్షల కంటే తక్కువ సమయంలోనే భూసార స్థితి, పోషకాల లభ్యత గురించి కచ్చితమైన సమాచారం లభిస్తుంది.
వాతావరణ అంచనాలు
వ్యవసాయ క్షేత్రానికి అతి దగ్గరగా ఉన్న వాతావరణ పరిస్థితులపై ఆన్లైన్లో సమగ్ర సమాచారాన్ని అందిస్తారు. దీనివల్ల రైతులు విత్తనాలు నాటడం, నీటి పారుదల, ఎరువుల వినియోగం, పంట కోత వంటి కీలక నిర్ణయాలను సకాలంలో తీసుకోగలుగుతారు.
డ్రోన్ ఆధారిత పంట పరిశీలన
డ్రోన్ ఇమేజింగ్, శాటిలైట్ మ్యాపింగ్ టెక్నాలజీలను ఉపయోగించి పంట ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తారు. పంటల్లో చీడపీడల దాడిని, వ్యాధులను త్వరగా గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను సిఫార్సు చేస్తారు.
రైతులకు మేలు చేస్తుందిలా..
ఆర్య.ఏజీ స్మార్ట్ ఫామ్ సెంటర్స్ సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకురావడం ద్వారా రైతులకు అనేక విధాలుగా మేలు చేస్తున్నాయి. సరైన సమయంలో, సరైన పరిమాణంలో వ్యవసాయం సాగేందుకు ఇది తోడ్పడుతుంది. ఉదాహరణకు, మట్టి విశ్లేషణ ద్వారా ఎంత ఎరువు వాడాలి.. వాతావరణ అంచనా ద్వారా ఎప్పుడు విత్తనం వేయాలి లేదా ఎప్పుడు పంట కోయాలి అనే విషయాలపై కచ్చితమైన సమాచారం లభిస్తుంది.
చీడపీడల తక్షణ గుర్తింపు (డ్రోన్ ఇమేజింగ్ ద్వారా) వల్ల త్వరగా నివారణ చర్యలు తీసుకునే వీలుంటుంది.
సకాలంలో వాతావరణ హెచ్చరికలు అందుకోవడం వల్ల రైతులు పంట నిర్ణయం తీసుకుంటారు.
అనవసరమైన లేదా అధిక ఎరువుల వాడకం, నీటి పారుదల వంటి వాటిని డేటా ఆధారంగా తగ్గించడం వల్ల రైతులకు ఉత్పాదక వ్యయం తగ్గుతుంది.
ఈ కేంద్రాలు ఆర్య.ఏజీ నిల్వ, మార్కెట్ లింకేజీలు, ఫైనాన్స్ సేవలతో అనుసంధానించబడి ఉండడం వల్ల, రైతులకు మెరుగైన ధర లభిస్తుంది.
ఇదీ చదవండి: 30 ఏళ్ల టోల్ పాలసీలో మార్పులు?


