
క్యూ4లో రూ. 3,025 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం జంప్చేసి రూ. 3,025 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,015 కోట్లు మాత్రమే ఆర్జించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 37 శాతం ఎగసి రూ. 11,061 కోట్లకు చేరింది.
ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. మొత్తం ఆదాయం 16 శాతం బలపడి రూ. 31,079 కోట్లయ్యింది. క్యూ4లో కార్గో నిర్వహణ 8 శాతం పెరిగి 118 మిలియన్ టన్నులను తాకింది. పూర్తి ఏడాదిలో 7 శాతం అధికమై 450 మిలియన్ టన్నులకు చేరింది. కాగా.. పోర్టులు, లాజిస్టిక్స్ బిజినెస్లలో వృద్ధి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లోనూ పటిష్ట పనితీరు చూపనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఆదాయంలో 16–22 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఈ ఏడాది రూ. 11,000–12,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు తెలియజేసింది.