రూ.10 వేలకోట్లతో అదానీ కాపర్‌ప్లాంట్‌.. | Adani Copper Plant With Rs10 Thousand Crores | Sakshi
Sakshi News home page

Adani Group: రూ.10 వేలకోట్లతో అదానీ కాపర్‌ప్లాంట్‌..

Feb 5 2024 12:55 PM | Updated on Feb 5 2024 1:28 PM

Adani Copper Plant With Rs10 Thousand Crores - Sakshi

గుజరాత్‌లోని ముంద్రాలో అదానీ గ్రూప్ 1.2 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.10వేలకోట్లు)తో గ్రీన్‌ఫీల్డ్ కాపర్ ఫెసిలిటీని ప్రారంభించనుంది. మొదటిదశలో ఏటా 5 లక్షల టన్నుల సామర్థ్యంతో దీన్ని రూపొందించనున్నట్లు సమాచారం. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ బంగారం, వెండి, నికెల్, సెలీనియంకు సంబంధించిన ఉప ఉత్పత్తులతో పాటు కాపర్‌ కేథోడ్‌లు, రాడ్‌లను తయారుచేయనున్నారు.

దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌తో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కూడా తయారుచేయనున్నారు. ఈ మిశ్రమం ఎరువులు, డిటర్జెంట్లు, ఫార్మాస్యూటికల్స్, పేపర్, షుగర్ బ్లీచింగ్, వాటర్ ట్రీట్‌మెంట్‌తోపాటు ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కాపర్‌ను విద్యుత్ పరికరాల ఉత్పత్తికి, పవర్ ట్రాన్స్‌మిషన్, పునరుత్పాదక ఇంధన రంగానికి విరివిగా వాడుతారు. దాంతో భవిష్యత్తులో కాపర్‌కు చాలా డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నారు. కానీ దేశంలో దాని నిలువలు పరిమితంగానే ఉన్నాయి.

అదానీ ప్లాంట్‌ ఉత్పత్తులు తయారీ ప్రారంభిస్తే దేశ కాపర్‌‌‌‌ దిగుమతులు తగ్గుతాయని, గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ కావడంలో సాయపడుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అతిపెద్ద సింగిల్ లొకేషన్ ప్లాంట్‌‌ను 2029 మార్చి నాటికి పూర్తి చేయాలని అదానీ గ్రూప్ చూస్తోంది. రెండు దశల్లో ప్లాంట్‌‌ పూర్తకానుండగా, మొదటి దశలో ఏడాదికి 5 లక్షల టన్నుల కెపాసిటీతో అందుబాటులోకి రానుంది.

ఈ కాపర్ రిఫైనరీ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయడానికి కచ్‌‌ కాపర్ లిమిటెడ్‌‌ (కేసీఎల్‌‌) పేరుతో ఓ సబ్సిడరీ కంపెనీని అదానీ గ్రూప్ ఏర్పాటు చేసింది.ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి అదానీ గ్రూప్ బ్యాంక్‌‌ల నుంచి అప్పు పొందింది. కాగా, 2022 ఏప్రిల్‌‌ – 2023 మార్చి మధ్య 1,81,000 టన్నుల ముడి కాపర్‌‌‌‌ మెటీరియల్‌ను దిగుమతి చేసుకుంది. 2027 నాటికి  దేశంలో 7,50,000 టన్నుల కాపర్ అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశీయంగా హిందాల్కో వంటి కంపెనీలు కాపర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. 

ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న పేటీఎం షేర్‌.. అసలేం జరుగుతోందంటే..

పారిశ్రామికంగా వినియోగించే లోహాల్లో స్టీల్‌, అల్యూమినియం తర్వాత స్థానంలో రాగి ఉంటుంది. భారతదేశంలో లోహల పరంగా తలసరి వినియోగం కేవలం 0.6 కిలోలు. అదే ప్రపంచ సగటు 3.2 కిలోలుగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దేశంలోని రాగి ఎగుమతులు ఇటీవల క్షీణించాయని కచ్ కాపర్ దీన్ని భర్తీ చేస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాపర్ ప్లాంట్ ఉప ఉత్పత్తులను  తమ గ్రూప్ సంస్థ అదానీ సిమెంట్స్ వినియోగించుకోగలదని కంపెనీ తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement