చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తజన సందడి నెలకొంది.ఆషాడమాసం చివరి ఆదివారం సందర్భంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఒక ఆదివారంరోజు మాత్రమే సుమారు 50 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. అమ్మవారిని అర్చకులు సుందరంగా అలంకరణ చేసి దర్శనభాగ్యం కల్పించారు. కోర్కెలు ఫలించిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. దర్శనం కోసంగంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో వయసు పైబడినవారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం ఇక్కట్లు పడ్డారు. వేలాది వాహనాలు బోయకొండకు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది.మెట్ట ప్రాతంలో వాహనాలు మొరాయించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. బోయకొండ దేవస్థానం వద్ద ఆదివారం విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా రూ:25.10 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు.
– ఒక్కరోజే 50 వేలమంది దర్శనం
– టికెట్ల ఆదాయం రూ:25.10లక్షలు


