పీలేరురూరల్ : పీలేరు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చోరీల పట్ల ప్రత్యేక దృష్టి సారించి రాత్రి సమయంలో పోలీస్ గస్తీ పెంచాలన్నారు. త్వరలో పీలేరులో జరుగనున్న వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేటట్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, రాయచోటీ డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్. ఇన్చార్జి సీఐ లక్ష్మన్, ఎస్బీ సీఐ సదాశివయ్య, ఎస్ఐలు లోకేష్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఒడిశా యువతి ఆత్మహత్య
చౌడేపల్లె : కూలీ పనుల కోసం ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చిన చాందిని చుర (19) అనే యువతి ఫ్యాన్కు ఉరివేసుకుని సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రం నిమ్మర్లు జిల్లాకు చెందిన విజయ్ కుమార్తె చాందిని చుర.. తన అక్క ఊర్వశి చుర, బావ రంజిత్లతో కలిసి చౌడేపల్లె మండలం లద్దిగం జోగిండ్లు వద్ద గల ఓ ప్రైవేట్ ఇటుకల బట్టీలో కూలీ పనుల కోసం వచ్చింది. ఏం జరిగిందో ఏమో కానీ, సోమవారం రాత్రి బట్టీ వద్ద తాము ఉంటున్న ఇంట్లోనే చాందిని ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సదరు యువతి అనారోగ్య కారణాల రీత్యా మృతి చెందిందని, గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించిందని కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.


