ఎండిన పాపాఘ్ని
కర్ణాటక–ఆంధ్ర సరిహద్దులోని పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం పంచాయతీ మీదుగా ప్రవహించే పాపాఘ్ని నది ఎండుతోంది. అన్నమయ్య, సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో ప్రవహించే ఈ నదిలో ప్రవాహం కరువైంది. ఫలితంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వ్యవసాయ బోర్లలో నీటిమట్టం తగ్గి సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది.
–సాక్షి, మదనపల్లె
ఏ ‘నార’దిష్టి తగిలిందో ఏమోగానీ ఖరీఫ్ సీజనంతా నీటి చుక్క లేకుండానే గడిచిపోయింది. కరిమబ్బు హలధారితో దోబూచులాడింది.. ఆశగా ఎదురుచూసిన నేలతల్లికి సైతం నీటి తడి లేకుండా చేసింది.. అక్కడక్కడ చిరు జల్లులు మినహా వాన వెల్లువైంది లేదు.. ఏ ఒక్క నదిలోనూ ఝరి పారింది లేదు.. నల్లగా మబ్బు పట్టడం తప్పా చుక్క నీరు జారింది లేదు... ఇదిగో ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. గతేడాది జూలైలోనే రాజోలి ఆనకట్ట నిండుకుండలా మారి పరవళ్లు తొక్కింది. నీటి సవ్వడులతో...కర్షకుల కన్నీళ్లు, కష్టాలను తుడిచింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఒక్కసారీ పదును వాన పడింది లేదు. ఫలితంగా ఇదిగో ఇలా చుక్క నీరు లేక రాజోలి ఆనకట్ట వెలవెలబోతోంది. కొందరు ఆయకట్టు రైతులు నీరు వస్తుందన్నా ఆశతో నారు పోశారు. వారి ఆశలపై వరుణుడు నీళ్లు చిలకరిస్తాడో.. కరుణించి దోసిళ్లతో కుమ్మరిస్తాడో కాలమే సమాధానం చెబుతుంది. – రాజుపాళెం


