మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నడుస్తున్న ఏఆర్టీ (యాంటీ రెట్రోవైరల్ థెరపీ) కేంద్రం హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు సంజీవనిలా మారుతోంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్,డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిడ్స్ కంట్రోల్ జిల్లా పర్యవేక్షణలో పనిచేస్తున్న ఈ కేంద్రంలో బాధితులకు సమీకృత సలహాలు, చికిత్సలు ఉచితంగా అందుతున్నాయని వైద్యాధికారి హుమాయూన్ తెలిపారు.
అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలు
ఐసీటీసీ నిఘా : అనుమానితులకు అత్యంత గోప్యంగా రక్త పరీక్షలు నిర్వహించి, మానసిక ధైర్యాన్ని ఇచ్చేలా కౌన్సెలింగ్ అందిస్తారు.
జీవితాంతం ఉచిత మందులు : ఇక్కడ హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి జీవితాంతం అవసరమయ్యే యాంటీ రెట్రోవైరల్ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
అధునాతన ల్యాబ్ పరీక్షలు : రోగులలో వ్యాధి నిరోధక శక్తిని, వైరస్ తీవ్రతను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు ల్యాబ్ టెక్నీషియన్ల ద్వారా సీడీ4, వైరల్ లోడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సురక్ష క్లినిక్ : ఆసుపత్రి ఆవరణలోనే సురక్ష క్లినిక్ ద్వారా లైంగికంగా సంక్రమించే సుఖ వ్యాధులకు కూడా ఉచిత పరీక్షలు, వైద్యం అందిస్తున్నారు.
అవగాహనతోనే సుదీర్ఘ జీవనం : హెచ్ఐవీ అనేది అంటువ్యాధి కాదని.. బాధితులను తాకడం వల్ల, కలిసి భోజనం చేయడం వల్ల లేదా ఒకే బాత్రూమ్ ఉపయోగించడం వల్ల ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపించదని ప్రజలు గ్రహించాలని కేంద్రం సిబ్బంది పుల్లయ్య నాయుడు, సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సకాలంలో వ్యాధి ని గుర్తించి, క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వాడితే బాధితులు సాధారణ వ్యక్తుల లాగే సుదీర్ఘ కాలం జీవించవచ్చని స్పష్టం చేశారు. లైంగిక సుఖ వ్యాధులు లేదా హెచ్ఐవీపై ఏమాత్రం అనుమానం ఉన్నవారైనా ఎలాంటి భయం లేకుండా ఏఆర్టీ కేంద్రాన్ని సంప్రదించవచ్చని వైద్యాధికారులు తెలిపారు.
ఉచితంగా ‘న్యాకో’ సేవలు,
సురక్ష క్లినిక్ చికిత్సలు


