బోయకొండలో భక్తజన సందడి
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు
చౌడేపల్లె: కోరిన కోర్కెలు తీర్చే బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రద్దీ కొనసాగింది. ఆదివారం రోజు మాత్రమే సుమారు 50 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఆషాడమాసం అత్యంత శుభకరమైన నెలగా భావించి వేల సంఖ్యలో కర్ణాటక భక్తులు ఆలయానికి తరలిరావడం గమనార్హం. ఈ సఽంధర్భంగా అమ్మవారిని అర్చకులు సుందరంగా అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. కోర్కెలు ఫలించిన వారు మొక్కులు చెల్లించారు. అమ్మవారి దర్శనం కోసంగంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. ప్రధాన గర్భాలయంనుంచి ఆలయం బయట గల గాలిగోపురం వరకు క్యూలైన్లు బారులు తీరాయి. దీనికారణంగా వయసు పైబడినవారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం ఇక్కట్లు పడ్డారు.
మొరాయించిన సర్వర్లు
టికెట్లు జారీచేసే కౌంటర్ల వద్ద సర్వర్లు మొరాయించడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. చివరికి మ్యాన్యువల్ టికెట్లు జారీచేసి భక్తులను దర్శనానికి పంపారు. రద్దీ రోజుల్లో టెక్నికల్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు అధికారులు తీసుకోకపోవంపై పలు ఆరోపణలకు దారితీసింది.
స్తంభించిన ట్రాఫిక్.....
వేలాది వాహనాలు బోయకొండకు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఎక్కడి వాహనాలు అక్కడే ముందస్తుగా సీఐ సాయిప్రసాద్ ఆదేశాలమేరకు ఎస్ఐ చిన్నరెడ్డప్ప , సిబ్బంది పర్యవేక్షణ చేసినా తిప్పలు తప్పలేదు. బోయకొండ దేవస్థానం వద్ద ఆదివారం ఒక్కరోజు మాత్రమే విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా రూ:18.87 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు.
ఒక్కరోజే 50 వేలమంది దర్శనం
క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ


