ఊరూరా సంబరం

YSRCP Leaders Celebrated All Over AP For 4 Years CM Jagan Govt - Sakshi

నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆనందోత్సాహం

గ్రామగ్రామాన ర్యాలీలు

కేకులు కట్‌ చేసి స్వీట్లు పంచిన వైఎస్సార్‌సీపీ నేతలు

పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు.. పేదలకు దుస్తుల పంపిణీ

సాక్షి నెట్‌వర్క్‌: నవరత్నాల బాటలో సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు బైక్‌ ర్యాలీలతో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. పలుచోట్ల నేతలు కేకులు కట్‌ చేసి స్వీట్లు పంచారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నిజమైన అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతల్లో రుజువు చేశారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సజ్జల పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి కేట్‌ కట్‌ చేశారు. నవరత్నాల ద్వారా సమ­సమాజ నిర్మాణంలో ముఖ్యమంత్రి జగన్‌ నిమగ్న­మ­య్యారని చెప్పారు. కాపీ కొట్టిన పథకాలతో టీడీపీ అధ్యక్షుడు కళ్లార్పకుండా అబద్ధాలాడుతున్నారని విమర్శించారు. 

కర్నూలులో కోలాహలంగా
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాల్లో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు మేయర్‌ బీవై రామయ్య, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్‌ మధుసూదన్, ఇషాక్‌ బాషా, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, డాక్టర్‌ సుధాకర్, తొగురు ఆర్థర్, గంగుల బిజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 కేఎన్‌ఎల్‌ 100 – నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరులో వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద సంబరాల్లో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య తదితరులు

‘తూర్పు’న ఘనంగా..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. రాజానగరంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించింది. తునిలో మంత్రి దాడిశెట్టి రాజా కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కాకినాడలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొన్నారు.

అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి పంచారు. రామచంద్రపురంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు  జరుపుకొన్నారు.

విజయనగరంలో సేవా కార్యక్రమాలు..
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించాయి. ఎస్‌.కోట, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు నిర్వహించగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. దివంగత వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.   

‘ప్రకాశం’లో మిన్నంటిన సంబరం
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఒంగోలులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ నేతృత్వంలో కేక్‌ కటింగ్, భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నారాంబాబు, కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్, చీమకుర్తిలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మార్కాపురంలో పార్టీ నేతలు కేక్‌ కట్‌ చేశారు.  

వైఎస్సార్‌ జిల్లాలో వేడుకగా..
వైఎస్సార్‌ కడప జిల్లావ్యాప్తంగా వేడుకలు జరిగాయి. కడపలోని హెడ్‌పోస్టాఫీసు ఎదుట వైఎస్సార్‌ విగ్రహానికి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

ప్రొద్దుటూరులోని కూరగాయల మార్కెట్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పూలమాలలు వేసి కేక్‌ కట్‌ చేశారు. కమలాపురం నగర పంచాయితీ కార్యాలయంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ నాయకులకు కేక్‌  పంచి పెట్టారు. పులివెందుల పురపాలక కార్యాలయంలో మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మెన్‌ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి పంచారు.

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. జమ్మలమడుగు మండలం పి.బొమ్మేపల్లిలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సుధీర్‌రెడ్డి కేక్‌ కట్‌ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జెడ్పీ చైర్మన్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. 

చిత్తూరులో చరిత్రాత్మకం..
ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. పుంగనూరు నియోజకవర్గం సదుంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేక్‌ కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి జోగి రమేష్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం, ఎమ్మెల్సీ భరత్, తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీష తదితరులు పాల్గొన్నారు.  పెడన నియోజవకర్గానికి చెందిన పలువురు ఎంపీపీలు, పార్టీ నేతలతో కలసి మంత్రి జోగి రమేష్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రంలో సంక్షేమ పాలన పదికాలాల పాటు కొనసాగాలని వేడుకున్నారు.

తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మేయర్‌ డాక్టర్‌ శిరీష కేక్‌ కట్‌ చేశారు. శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేక్‌లు కట్‌ చేశారు. సత్యవేడు నియోజక వర్గవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారాయణవనంలో కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్వేటి నగరంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ఆధ్వర్యంలో కేట్‌ కట్‌ చేశారు. గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు శాంతినగర్‌ కూడలిలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు.

విశాఖలో వైభవంగా..
ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఘనంగా సంబరాలు జరిగాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కె.కె రాజు కేక్‌ కట్‌ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అంబికాబాగ్‌ రామాలయం  కళ్యాణ మండపంలో కేక్‌ కట్‌ చేసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్, కార్పొరేషన్‌ చైర్మన్‌లు కోలా గురువులు, జాన్‌ వెస్లీ, వి.మధుసూదన్‌రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యలో సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

భీమిలి నియోజవర్గంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేక్‌ కట్‌ చేసి ఆనందపురం నుంచి తగరపువలస వరకూ ర్యాలీ నిర్వహించారు. పెందుర్తి నియోజవర్గంలో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజు అధ్వర్యంలో వేపగుంట జంక్షన్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించి కేక్‌ కట్‌ చేశారు. వేపగుంట నుంచి పెందుర్తి వరకు బైక్‌ ర్యాలీ చేపట్టారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజవర్గంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కేక్‌ కట్‌ చేశారు. చోడవరం నియోజకవర్గం గర్నికంలో ప్రభుత్వ విప్, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాయకరావుపేట నియోజకవర్గం అడ్డురోడ్డు జంక్షన్‌లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు కేక్‌ కోశారు. అనకాపల్లిలో పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్‌ కేక్‌ కట్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేటలో ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాగులాపల్లి కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు పాల్గొన్నారు. 

కృష్ణాలో కదం తొక్కిన శ్రేణులు
ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు దివంగత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారీ కేక్‌ కట్‌ చేసి మహిళలకు చీరలు, చిరువ్యాపారులకు టిఫిన్‌ బండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జగ్గయ్యపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, మునిసిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి కేక్‌ ట్‌ చేశారు.  అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కేక్‌ కట్‌ చేశారు. గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  పామర్రు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు.

పేదల పెన్నిధి
వలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ఇంటివద్దే అందిస్తూ పేదలకు రాష్ట్రం  స్వర్గధామంలా నిలిచిందని ఆంధ్రప్రదేశ్‌ సి.రాఘవాచారి మీడియా అకాడమీ ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలోని మొగల్రాజపురం మీడియా అకాడమీ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అన్ని సేవలను ఇంటివద్దే అందిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు.

అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ సీఎం జగన్‌ ప్రభుత్వం ఆటుపోట్లు, ముష్కర మూకల దాడులను తట్టుకుని నాలుగేళ్లు పూర్తి చేసుకుందన్నారు. మేధావులు, పరిశీలకుల ముసుగులో కొందరు చేస్తున్న విపరీత వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2.11 లక్షల కోట్లను లబ్థిదారులకు నేరుగా, పారదర్శకంగా పంపిణీ చేసిందని సీనియర్‌ జర్నలిస్ట్‌ వీవీఆర్‌.కృష్ణంరాజు చెప్పారు. 

హార్టికల్చర్‌ హబ్‌గా ఏపీ
సీఎం జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ హార్టికల్చర్‌ హబ్‌గా మారిందని అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును రాష్ట్రంలో ప్రొత్సహిస్తున్నామన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎంసీ.దాస్‌ చెప్పారు.

నాగార్జున యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ.శ్రీనివాస్‌రెడ్డి, జర్నలిజం విభాగాధిపతి జి.అనిత, సీనియర్‌ జర్నలిస్ట్‌లు నిమ్మరాజు చలపతిరావు, మీడియా అకాడమీ కార్యదర్శి బాలగంగాధర్‌ తిలక్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పాలనపై రచయిత గాజులపల్లి రామచంద్రారెడ్డి రాసిన సుపరిపాలన–సుజలాం–సుఫలాం పుస్తకాన్ని కార్యక్రమంలో ఆవిష్కరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top