జగన్‌ వెంట జన సాగరం | YS Jaganmohan Reddy receives unprecedented support at every step at vizag | Sakshi
Sakshi News home page

జగన్‌ వెంట జన సాగరం

Jul 31 2026 5:05 AM | Updated on Jul 31 2026 5:13 AM

YS Jaganmohan Reddy receives unprecedented support at every step at vizag

భోగాపురం హైవే వద్ద అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాకుళం దాకా జన జాతర 

ప్రతిచోటా జన ప్రవాహం.. కాన్వాయ్‌ను ముందుకుకదలనివ్వకపోవడంతో ఆలస్యంగా పర్యటన 

120 కిలోమీటర్ల దూరానికి ఆరున్నర గంటలు

పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు, యువత 

సీదిరి కుటుంబానికి సంఘీభావంగా పోటెత్తిన మత్స్యకార కుటుంబాలు 

అడుగడుగునా ఖాకీలను మోహరించిన సర్కారు  

భోగాపురం ఎయిర్‌పోర్టు బందోబస్తు పోలీసులను తరలించి కట్టడి యత్నాలు 

అడ్డంకులను అధిగమించి రోడ్డెక్కిన జనం.. ఆంక్షలను ఎదిరించి ఉరిమిన ఉత్తరాంధ్ర 

బారికేడ్లతో అడ్డుకున్నా.. వాహనాలు నిలిపివేసినా.. కాలి నడకనే జగనన్న వెంట పయనం 

వైఎస్‌ జగన్‌ను కలిసి సమస్యలు విన్నవించిన ఉద్యోగులు, రైతులు 

సాక్షి, విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, అరసవల్లి: అడుగడుగునా ఖాకీలను మోహరించి చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకున్నా లెక్క చేయకుండా జన సముద్రం పోటెత్తింది! పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూసినా కుయుక్తులు పారలేదు. విశాఖ నుంచి సిక్కోలు దాకా జనవాహిని ఉప్పొంగింది. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి చోటా ఘన స్వాగతం పలికారు. 

అక్రమ కేసులో అరెస్టై శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు విశాఖలో ఉదయం 11 గంటలకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం మండలంలోని అంపోలు జైలు వద్దకు చేరుకోగలిగింది. 120 కిలోమీటర్ల దూరానికి ఆరున్నర గంటలు పట్టిందంటే జనం తాకిడి.. జగన్‌పై ఉన్న అభిమానం ఏ స్థాయిలో పోటెత్తిందో అర్థం చేసుకోవచ్చు. తొలుత విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పర్యటన ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం జంక్షన్, అడవివరం, సత్తరువు జంక్షన్, నీలకుండీలు, ఆనందపురం జంక్షన్, తగరపువలస మీదుగా శ్రీకాకుళం వైపు సాగింది. విశాఖ జిల్లాలోనే సుమారు మూడు గంటల పాటు సాగింది. 

దారి పొడవునా శ్రీకాకుళం దాకా ఎటు చూసినా జనమే. కాన్వాయ్‌ని ముందుకు కదలనివ్వకుండా జన ప్రవాహం కొనసాగింది. మధ్యాహ్నం 1:35 గంటలకు కాన్వాయ్‌ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. వైఎస్‌ జగన్‌ పర్యటనలో యువత, మహిళలు పెద్ద ఎత్తున కనిపించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పోలీసులు కవ్వింపు చర్యలకు దిగారు. రోడ్డెక్కిన ప్రతి ఒక్కరినీ అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని గదమాయించారు. లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో చాలా మందికి గాయాలయ్యాయి. కానీ ఖాకీలు ఎంతగా అడ్డుకున్నా జన ప్రవాహాన్ని నిరోధించలేక చివరకు చేతులెత్తేశారు. 

వెల్లువెత్తిన వినతులు 
విశాఖ విమానాశ్రయంలో సుమారు 160 మంది ఎయిర్‌పోర్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వైఎస్‌ జగన్‌ను కలసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కాకాణి నగర్‌ వద్ద విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన కాందిశీకులు వైఎస్‌ జగన్‌ను కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అడవివరం జంక్షన్‌ (భీమిలి) వద్ద పంచగ్రామాల భూ సమస్యపై స్థానికులు మాజీ సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఆనందపురం జంక్షన్‌ వద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణం కోసం తమ వద్ద నుంచి సేకరించిన డీ–పట్టా భూములకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి చెందిన బీసీ, ఎస్సీ రైతులు వైఎస్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 

పోటెత్తిన మత్స్యకారులు...: మత్స్యకార కుటుంబానికి చెందిన డాక్టర్‌ సీదిరి అప్పలరాజు రాజకీయాల్లో ఎదగడాన్ని జీరి్ణంచుకోలేక టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయడంపై మత్స్యకారులు రగిలిపోతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం, కోష్ట తదితర తీర ప్రాంతాల నుంచి వందలాది మత్స్యకార కుటుంబాలు జగన్‌ పర్యటనలో పోటెత్తాయి. అంపోలు ప్రాంతానికి గార, శ్రీకాకుళం రూరల్‌తో పాటు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందిన మత్స్యకారులు స్వచ్ఛందంగా తరలివచ్చి అప్పలరాజుకు మద్దతుగా జగనన్నను కలిసి తమ ఆవేదన తెలియచేశారు.  


పోలీసుల ఆంక్షలు.. కాలి నడకన నేతలు 
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన పొడవునా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను నిరోధించేందుకు యత్నించినా అభిమానం ముందు ఆ ఆంక్షలు నిలవలేదు. రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు, నాయకులు నేతలు కాలినడకనే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. జగన్‌ పర్యటనను అడ్డుకోవడానికి భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంబోత్సవం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించిన పోలీసు బలగాలను శ్రీకాకుళం జిల్లాకు డంప్‌ చేశారు. 

రెండు వేల మందికి పైగా పోలీసులను జాతీయ రహదారి పొడవునా, ప్రతి గ్రామ శివారులో కాపలా పెట్టారు. వైఎస్‌ జగన్‌ పర్యటన సాగే శ్రీకాకుళం, రణస్థలం, పైడి భీమవరం, కొత్తరోడ్డు, పెదపాడు వైపు రావద్దని ప్రజలను హెచ్చరించారు. అయినా జనం వెనక్కి తగ్గలేదు. జగన్‌ వెంటే సాగారు. వైఎస్‌ జగన్‌ వారిని నిరాశ పరచకుండా అభివాదం చేస్తూ, కరచాలనాలు అందిస్తూ, వినతులు స్వీకరిస్తూ ముందుకు కదిలారు. ఆయన కేవలం 8 వాహనాల కాన్వాయ్‌తో మాత్రమే వెళ్లి సీదిరి అప్పలరాజును కలిసేందుకు అనుమతించారు. 

ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా జైలు వద్దకు చేరుకునే సరికి సమయం మించిపోయింది. దీంతో జైలు ఆవరణలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భార్య శ్రీదేవి, కుమారులు ఆరవ్‌ వర్మ, అర్నవ్‌ వర్మ, అప్పలరాజు సోదరుడు త్రినాథరావు, ఇతర కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.  

అంబులెన్సులు, అంతిమయాత్ర వాహనాలను సైతం అడ్డుకుని..
నలుమూలల నుంచి తరలి వస్తున్న పార్టీ శ్రేణులతో పాటు కీలక నేతల కార్లను గురువారం ఉదయం నుంచి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో ప్రయాణించేందుకు సైతం నిరాకరించారు. కొత్తరోడ్డులో అంతిమయాత్ర వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. క్షతగాత్రులను తరలిస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో విడిచిపెట్టారు. వజ్రపుకొత్తూరు మండలం నరేంద్రపురం వద్ద మహిళలను ఆస్పత్రులకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డగించారు. రాగోలు వద్ద పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు.

ఎచ్చెర్ల రోడ్డు నవభారత్‌ జంక్షన్‌ వద్ద వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వెంట స్థానిక నేతల వాహనాలు వెళ్లకుండా జాతీయ రహదారిని గంట సేపు దిగ్భందించారు. అంపోలు కూడలిలో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. వైఎస్‌ జగన్‌ వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నేతలు ఉన్నారు. వీరంతా జగన్‌కు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement