పార్టీ కమిటీలన్నీ పూర్తిస్థాయిలో కదలాలి
యువతను ఉద్యమంలో భాగస్వాములను చేయాలి
టెలీకాన్ఫరెన్స్లో పార్టీ ముఖ్యనేతలకు సజ్జల దిశానిర్దేశం
సాక్షి, అమరావతి: డీఎస్సీ స్కామ్, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయం, ఫీజుల బకాయిల చెల్లింపు వంటి ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టిన ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంటు పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు(కో–ఆర్డినేషన్), రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులకు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు.
జూలై 31న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం నుంచి ప్రారంభించి, టౌన్హాల్ సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, భారీ ర్యాలీల వరకు పార్టీ ప్రకటించిన కార్యాచరణను విజయవంతం చేయాలన్నారు. డీఎస్సీ అంశం ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగ యువకుడికి సంబంధించినదని, అందుకే ఇది కేవలం పార్టీ కార్యక్రమంగా కాకుండా యువత ఉద్యమంగా మారాలన్నారు. కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు అన్ని చోట్లా విద్యార్థులను చైతన్యపరచాలన్నారు. డీఎస్సీ అభ్యర్థులను నేరుగా కలుసుకొని టౌన్హాల్ సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీల్లో భాగస్వాములను చేయాలన్నారు. బాధితులే మాట్లాడేలా వేదిక కల్పిస్తే ఉద్యమానికి మరింత బలం వస్తుందని సజ్జల స్పష్టం చేశారు.
ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి
టౌన్హాల్ సమావేశాలు కేవలం పార్టీ సమావేశాలుగా కాకుండా సమాజ చర్చలుగా కనిపించాలన్నారు. విద్యావేత్తలు, రిటైర్డ్ అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పాల్గొనేలా చూడాలన్నారు. రిలే నిరాహార దీక్షల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, స్కిట్ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. అలాగే, ఎస్ఐఆర్ ప్రక్రియ, ఏఎస్డీ జాబితాలు, అన్మ్యాప్డ్ ఓటర్లు, ఫారమ్6, ఫారమ్7, డూప్లికేట్ ఓట్ల అంశాలను ప్రతి నియోజకవర్గంలో జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. బీఎల్వోలతో సమన్వయం కొనసాగిస్తూ అవసరమైతే అభ్యంతరాలు దాఖలు చేయాలన్నారు.


