ఉపాధ్యాయ అభ్యర్థుల కెరీర్లు మీకు అపహాస్యంగా మారాయా?
దీనిని ఏ విధంగా న్యాయమైనది, పారదర్శకమైనది అని అనగలం?
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియలో ఏడు దశల వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ మెగా డీఎస్సీ స్కామ్పై ఆయన మరోసారి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘వెరిఫికేషన్.. నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్’ అంటూ జగన్ ఎక్స్లో పోస్టు చేశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందని చెప్పారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ నిలదీశారు.
ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కారు ఆటలాడుతోందని అన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల కెరీర్లు మీకు అపహాస్యంగా మారాయా అని మండిపడ్డారు. ‘ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడంలేదు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలింది. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారు? ఇది స్కామ్ కాదా? దీనికి మీరు నైతిక బాధ్యత వహించరెందుకు’ అని వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుని నిలదీశారు.
స్కిల్ కేసులో క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం
చంద్రబాబు చేసిన స్కామ్లో ఆయనే సొంతంగా క్లీన్ చిట్ ఇప్పించుకుని భుజాలు ఎగరేసుకుంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఫేస్బుక్లో ఈమేరకు ఒక పోస్టు చేశారు. ‘అధికారులను బెదిరించి తనపై ఉన్న కేసుల పని పూర్తి చేసుకుని క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం. తన మీద కేసులు తానే కొట్టేయించుకుంటున్నాడు. ఎందుకంటే అవన్నీ నిజం కాబట్టి. ఇప్పుడు కూడా డీఎస్సీ కేస్ని నిర్వీర్యం చేసే పని చేస్తున్నాడు. అయినా స్కిల్ కేసులో తనకు క్లీన్చిట్ వచ్చిందని చెప్పుకోవడం ఎంతటి దౌర్భాగ్యం’ అని వైఎస్ జగన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.


