3,897 మందిని పరిశీలించగా 949 మందికి వ్యాధి నిర్ధారణ
కవిటిలో అత్యధిక కేసులు
ఐసీఎంఆర్కు మధ్యంతర నివేదిక అందజేసిన అధ్యయన బృందం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో 24.35 శాతం మంది కిడ్నీ వ్యాధితో సతమతమవుతున్నారు. వ్యాధి మూలాలపై అధ్యయనం చేస్తున్న బృందం ఇప్పటి వరకూ 3,897 మందిని పరిశీలించగా వీరిలో 949 మందికి కిడ్నీ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. బాధితుల్లో 550 మందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ), 399 మందికి కారణం తెలియని క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీయూ) ఉన్నట్టు తేల్చారు. కవిటి మండలంలో అత్యధికంగా వ్యాధి బాధితులున్నట్టు వెల్లడించారు.
ఉద్దానం ప్రాంతంలో 5,851 మందిని పరిశీలించి ఇప్పటి వరకూ గుర్తించిన అంశాల ఆధారంగా ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)కు మధ్యంతర నివేదికను అధ్యయన బృందం సమర్పించిందని రాష్ట్ర వైద్య శాఖ శనివారం ప్రకటించింది. మూత్రంలో ఆల్బుమిన్ స్థాయిలపైనా విశ్లేషణ చేపట్టారు. కొందరిలో కిడ్నీ పనితీరు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ ఆల్బుమిన్ అసాధారణంగా కనిపించినట్లు నివేదికలో స్పష్టం చేశారు.
కిడ్నీ పనితీరు తగ్గడంతో పాటు ఆల్బుమిన్ పెరిగిన వారిపై ప్రత్యేకంగా దృష్టిఅవసరం ఉందని అధ్యయనం సూచిస్తోంది. కిడ్నీ వ్యాధికి దారితీసే పర్యావరణ సంబంధిత అంశాలపై విశ్లేషణలో భాగంగా నీరు, మట్టి నమూనాలతో పాటు రక్తం, మూత్ర నమూనాల్లో పురుగుమందుల అవశేషాలు, భారీ లోహాలు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.


