గంగాధర నెల్లూరులోని గుజ్జు ఫ్యాక్టరీ ఎదుట ఆత్మహత్యాయత్నం చేస్తున్న రైతు
నాలుగు రోజులుగా మామిడి కాయలతో ఫ్యాక్టరీ వద్ద నిరీక్షణ
సీరియల్ నంబర్ ఇవ్వకపోవడంతో ఒంటిపై డీజిల్ పోసుకున్న రైతు
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దుస్థితి దారుణంగా తయారైంది. సీరియల్ నంబర్ కోసం నాలుగు రోజులుగా గుజ్జు ఫ్యాక్టరీ వద్ద వేచి చూసిన ఓ యువరైతు చివరికి ఫ్యాక్టరీ గేటు వద్దే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. గంగాధర నెల్లూరు మండలం బొమ్మవారిపల్లికి చెందిన యువరైతు లోకేశ్ నాయుడు నాలుగు రోజుల క్రితం మామిడి లోడుతో జైన్ మామిడి గుజ్జు పరిశ్రమకు చేరుకున్నాడు. వరుసలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సీరియల్ నంబర్ ఇవ్వలేదు. కానీ అర్ధరాత్రి వేళ సిఫారసులతో వచ్చిన వాహనాలను వరుసగా ఫ్యాక్టరీలోకి వెళ్తుండటంతో ప్రశ్నించగా, అక్కడి సిబ్బంది, దళారులు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ దురుసుగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అవమానంతో కుంగిపోయిన లోకేశ్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న రైతులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడున్న రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఫ్యాక్టరీ లోపల బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.


