రేణిగుంట: తాను సహజీవనం చేసిన మహిళ మోసకారి అని తెలుసుకుని దూరం పెట్టగా, కక్ష పెంచుకున్న ఆ మహిళ బ్లాక్ మెయిల్ చేసి వేధించడంతో రేణిగుంటలోని సీఆర్ఎస్ ఉద్యోగి రవి (36) ఉరివేసుకొని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం.. తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన కిల్లి రవి రేణిగుంట సమీపంలోని సీఆర్ఎస్లో ఉద్యోగం చేస్తూ బుగ్గ వీధిలోని ఓ ఇంట్లో నివాసముంటున్నాడు.
ఈ క్రమంలో తిరుపతికి చెందిన ఓ మహిళ పరిచయమైంది. ఆ మహిళతో మూడేళ్లుగా సన్నిహితంగా ఉన్నాడు. గతంలో మహిళకు మూడు పెళ్లిళ్లు జరిగిన విషయం గ్రహించిన రవి ఆమెని దూరం పెట్టాడు. ఇది జీర్ణించుకోలేని మహిళ సీఆర్ఎస్లోని ఉద్యోగానికి నామినీగా తన పేరును చేర్చాలని, అదేవిధంగా కోటి రూపాయలు తనకు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఆమెకు తిరుపతిలోని వామపక్ష నాయకులు అండగా నిలిచి అతనిని మానసికంగా వేధించారు. ఈ వేధింపులు తాళలేక గతంలో అనేకసార్లు మీడియా ముందు తన బాధను వెల్లడించాడు.
అయినా ఆమె వేధింపులు తీవ్రం అవడంతో చేసేదేమీ లేక మంగళవారం తాను కాపురం ఉన్న బాడుగ ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు. అంతకు ముందు సూసైడ్ నోట్ రాసి, సూసైడ్ నోటును తన సహచర ఉద్యోగస్తులకు, తమ్ముడికి వాట్సాప్ ద్వారా పంపించారు. సూసైడ్ నోట్లో తన చావుకు ఉషారాణి, విజయలక్ష్మి , రాధాకృష్ణ అనేవారు కారణమని వారిపై పోలీసులకు నేను గతంలో ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి వారికి శిక్ష పడేటట్టు చేయాలని కోరాడు. రేణిగుంట అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకొని, విచారణ చేపట్టారు.


