విభిన్న రంగాల్లో పరిశోధనలకు పూనుకోవాలి | Vigyan University 11th Convocation: Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

విభిన్న రంగాల్లో పరిశోధనలకు పూనుకోవాలి

Oct 25 2023 5:46 AM | Updated on Oct 25 2023 5:46 AM

Vigyan University 11th Convocation: Nirmala Sitharaman - Sakshi

చేబ్రోలు: ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు కలిగిన దేశమేదైనా ఉందంటే అది భారతదేశమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ వర్సిటీలో సోమవారం 11వ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు, విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌పీ వాసిరెడ్డి, ఇండియన్‌ చెస్‌ ప్లేయర్‌ కోనేరు హంపిలకు గౌరవ డాక్టరేట్‌లను, 1,820 మందికి డిగ్రీలు, మరికొంతమందికి గోల్డ్‌ మెడల్స్, అవార్డులను అందజేశారు.

నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు మాత్రమే కాకుండా కొత్త మెటీరియల్స్, రేర్‌ మినరల్స్, మెటీరియల్‌ సైన్స్, డ్రోన్‌ టెక్నాలజీ వంటి రంగాల్లో పరిశోధనలకు పూనుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే ఇస్రో చంద్రయాన్‌–3 ద్వారా దక్షిణ ధృవం మీదకు వెళ్లగలిగామని, 2040 నాటికి మానవ రహిత ప్రయోగానికి పూనుకోవాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.

2035 లోపు ‘భారత స్పేస్‌ స్టేషన్‌’ను పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలని ఇస్రోకు ప్రధాని మోదీ సూచించారని తెలిపారు. చంద్రయాన్‌–3 విజయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు చంద్రయాన్‌ నమూనాను బహుమతిగా అందజేశారు. రాష్ట్ర మంత్రి బుగ్గన మాట్లాడుతూ విద్యార్థుల మేధోపరమైన, విద్యాపరమైన అన్వేషణను వారి వృత్తిపరమైన విజయాలను కుటుం­బం, స్నేహితులు, శ్రేయోభిలాషులతో జరుపుకోవడానికి ఇది చిరస్మరణీయ వేదిక అని అన్నా­రు. విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వీసీ నాగభూషణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement