సాక్షి, విశాఖపట్నం: ఇటీవల హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా దాడులు జరిపింది. ఆ అటాక్లో ముగ్గురు భారతీయులు మరణించడం భారత్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు రేపింది. తాజాగా ఆ దాడిలో మరణించిన చీఫ్ మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేశ్ సతీమణి తీవ్ర ఆవేదనతో స్పందించారు. ఇప్పటి వరకూ ఈ అంశంలో కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఇటీవల హర్ముజ్ ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ సెట్టెబెల్లో' చమురు ట్యాంకర్పై అమెరికా సైనిక దళాలు దాడులు జరిపాయి. ఈదాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందిన పట్నాల సురేశ్ తెలుగువారున్నారు. ఇరాన్ రేవులపై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని (Blockade) ఉల్లంఘించిందనే ఆరోపణలతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ అటాక్ చేసింది. అయితే ప్రమాదంలో చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్, డెక్ కాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా అనే ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా ఈ ఘటనపై మెరైన్ చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ భార్య భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. "...ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ సిబ్బంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇప్పటివరకు ఎవరూ కనీసం దీనిపై సరైన స్పందన ఇవ్వలేదు. నేను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని అడుగుతున్నాను. బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందిస్తారు? అమెరికా ప్రభుత్వాన్ని కూడా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను... మా కుటుంబంలో నా భర్త ఒక్కరే సంపాదించేవారు. ఇక నా పిల్లలను నేను ఎలా పెంచాలి?..." అనే ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్లోని అమెరికా అత్యున్నత దౌత్యవేత్త (ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్కు రెండు సార్లు సమన్లు జారీ చేసింది. మరోవైపు ట్రంప్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ దాడులు చేసింది ఇరాన్ అని దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని తెలిపారు.


