మళ్లీ ఉక్కపోత.. | Temperatures 3 to 5 degrees above normal | Sakshi
Sakshi News home page

మళ్లీ ఉక్కపోత..

Aug 8 2023 4:09 AM | Updated on Aug 8 2023 4:09 AM

Temperatures  3 to 5 degrees above normal - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణం మళ్లీ సెగలు కక్కుతోంది. కొద్దిరోజుల నుంచి ఉష్ణ తీవ్రత అధికమై పగటి పూట ఎండ చుర్రుమంటోంది. వర్షా­కాలంలో ఇలాంటి వాతావరణం అరుదుగా కనిపి­స్తుంది. మరోవైపు ఉష్ణతాపానికి ఉక్కపోత కూడా తోడవుతోంది. ఇది ప్రజలను తీవ్ర అసౌక­ర్యానికి గురి చేస్తోంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన­పడిన తర్వాత రాష్ట్రంలో ఈ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉంటోంది. ఉదయం 9 గంటలు దాటితే చాలు.. ఎండ ఊపందుకుని సాయంత్రం వరకు కొన­­సాగుతోంది.

కొన్నాళ్లుగా రాష్ట్రంలో తేలికపాటి జల్లులే తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. పైగా మేఘాలు కూడా అంతగా ఏర్పడటం లేదు. ఫలితంగా సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఎండల ప్రభావం కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెబుతు­న్నా­రు. ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు ఉండవ­చ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఆగ­స్టు మొదటి వారంలో అల్పపీడ­నాలు ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు వానలకు బదులు ఎండలు కాస్తున్నాయి. ప్రస్తు­తం రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల్లో వర్షాలు కురిపించేటంత తేమ ఉండటం లేదు. దీంతో వానలకు ఆస్కారం ఉండకపోగా ఉక్కపోత కూడా ఇబ్బంది పెడుతోంది.

40 డిగ్రీలకు చేరువలో..
రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోద­వుతున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ­లకు చేరువలో రికార్డవుతున్నాయి. సోమ­వా­రం బాపట్లలో అత్యధికంగా 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికం. ఇంకా పలుచోట్ల 35నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోద­య్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణతీవ్రత కొనసా­గుతుందని, అసౌకర్యంతో కూడిన వాతా­వర­ణం ఉంటుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. సాధా­ర­ణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా నమో­దయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయల­సీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు గాని కురిసే అవకాశం ఉందని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement