
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ సాక్షి ప్రతినిధితో ఆయన శుక్రవారం మాట్లాడారు.
రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు.
వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా?. అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

‘‘వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు’’ అని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు.