అల్లూరి సీతారామరాజు జిల్లా : తూర్పు కనుమల మధ్య ప్రవహించే సీలేరు నదిలో శనివారం అరుదైన చేప మత్స్యకారుడి వలకు చిక్కింది. సుమారు మూడు కిలోలకు పైగా బరువున్న ఈ చేపను స్థానికులు సిల్వర్ కార్ప్గా గుర్తించారు. సాధారణంగా ఆసియా దేశాలు, ముఖ్యంగా చైనా, తూర్పు ఆసియా ప్రాంతాలకు చెందిన ఈ మంచినీటి చేప ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పెంపకంలో ఉంది. సీలేరు నదిలో ఈ జాతి చేప కనిపించడం అరుదుగా భావిస్తున్నామని స్థానిక మత్స్యకారులు తెలిపారు.
వెండి రంగులో మెరిసే శరీరం ఈ చేపకు ప్రత్యేక ఆకర్షణ. శరీరం పైభాగంలో లేత ఆకుపచ్చ లేదా బూడిద రంగు కనిపిస్తుంది. వేగంగా పెరిగే ఈ చేపలు సాధారణంగా మూడు నుంచి నాలుగు కిలోల వరకు బరువు పెరుగుతాయి. తలపై పొలుసులు ఉండవు.సాధారణంగా 6 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న మంచినీటిలో ఇవి జీవిస్తాయి. లభ్యమైన చేప మూడు కిలోల బరువు ఉంది.


