విశాఖ: సముద్రంలో గల్లంతై, సురక్షితంగా బయటపడ్డాడు మత్స్యకారుడు కారె చిన్న. ఐఎన్ఎస్ డేగాకు సుమారు సాయంత్రం 7 గంటలకు తీసుకొచ్చారు రక్షణ సిబ్బంది. కార్గో షిప్ నుంచి కారె చిన్నాను హెలికాప్టర్లో నేవీ సిబ్బంది సురక్షితంగా తీసుకొచ్చారు. చిన్నాకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు.
మత్స్యకారుల గల్లంతు, బోటు ప్రమాదంపై డీఐజీ గోపీనాథ్ జెట్టి కీలక వివరాలు తెలిపారు. ఈ నెల 4వ తేదీ రాత్రి 11.30 గంటలకు మత్స్యకారులు గల్లంతు అయినట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. మరుసటి రోజు ఉదయం సెర్చ్, రెస్కూ ఆపరేషన్ మొదలుపెట్టామని అన్నారు.
‘‘కారే చిన్నాను 5వ తేదీ ఉదయం 7.30 గంటలకు రెస్క్యూ చేశాం. 4 నౌకలు, 2 హెలికాప్టర్లు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. 72 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సముద్రంలో వాతావరణం అనుకూలించక సెర్చ్ ఆపరేషన్ కష్టతరంగా మారింది. అలలు 4 మీటర్లు ఎత్తులో వస్తున్నాయ్. చిన్నా వెదర్ కండిషన్ సర్దుకున్నాక తీరానికి తీసుకొస్తాము.
మరో 24 గంటలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల బోటు తిరగబడింది. చిన్నా సోదరుడు బోటు కింద ఉండి పోయాడు. మిగిలిన వారు రాత్రి 9 గంటల వరకు బోటు మీద ఉన్నారు. మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయంలో చిన్నా చైనాకు చెందిన షిప్ లో సురక్షితంగా వచ్చాడు. మిగతా వారు అందుకోలేక పోయారు..
మరోవైపు, బోటు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కారె చిన్నా ఆ తర్వాత మరో వీడియో విడుదల చేశాడు. ‘‘బోటులో నన్ను బాగానే చూసుకుంటున్నారు. నా తోటి వారిని కోల్పోయానని ఆందోళనగా ఉంది. నన్ను దూరంగా తీసుకొని వెళ్లండి. నాకు గుండెల్లో నొప్పిగా ఉంది’’ అన్నారు.


