సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు శ్వేతపత్రంపై ఏపీజీఈఎఫ్ మాజీ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్న తీరును ఆయన వివరించారు. శ్వేత పత్రం పేరుతో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని.. రూ.30 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని.. డీఏ, పీఆర్సీ, ఐఆర్ వంటివి ఇక లేనట్టేనని ఎల్లోమీడియా రాస్తోందన్నారు.
‘‘హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగులకు జీతాలు తగ్గించినట్టు ఎల్లో మీడియా రాసింది. అదే విధంగా ఏపీలో కూడా తగ్గించాలన్నట్టుగా రాశారు. ఇక మీదట జీతాలు ఇస్తే చాలన్నట్టుగా ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు రూ.55 వేల కోట్లు బకాయి పడింది. ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్ పెట్టారు. రెండేళ్లుగా ఐఆర్ లేదు’’ అని వెంకట్రామిరెడ్డి దుయ్యబట్టారు.
‘‘వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగులకు ఎక్కువ ఖర్చు చేశారని చంద్రబాబే అంగీకరించారు. మూడున్నర లక్షల మంది ఉద్యోగులను రోడ్డున పడేసిన చరిత్ర చంద్రబాబుది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఉద్యోగుల జీతాలు ఖర్చు 45 శాతం మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం వచ్చే ఆదాయమంతా ఉద్యోగులకే సరిపోతుందనటం పచ్చి అబద్ధం కాదా?. అమరావతి ఆవకాయ, యోగా కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అద్దాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఇక సీఎం, మంత్రుల విలాసాల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఉద్యోగుల మీద ప్రజలకు చెడు అభిప్రాయం తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే కోరుతున్నాం. కొన్ని శాఖల్లో రెండు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగారు. ఆంధ్రా యునివర్సిటీ వీసీ రిటైర్మెంట్కు గంట ముందు సస్పెండ్ చేశారు. ఐదేళ్ల క్రితం సెలవు పెట్టారని ప్రతాప్ రెడ్డికి ఛార్జిమెమో ఇవ్వటం దుర్మార్గం’’ అంటూ వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు.


