మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గురువారం ఓ మహిళ చీరల ప్రమోషన్ కోసం వీడియో చేయడం వివాదాస్పదమైంది. ఓ యువతి యువకుడు దేవస్థానంలో ఓ బోటిక్ ప్రమోట్ చేయడం కోసం వీడియోలు తీశారు. ఆ యువతి ధరించిన చీరను ప్రమోట్ చేసేందుకు బోటిక్ సంగతులు పంచుకుంటూ కావాల్సిన వారు ఆ బోటిక్ను సంప్రదించవచ్చని ప్రమోషన్ వీడియో తీశారు.
నృసింహుని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం అనంతరం ఓ రకమైన ఆధ్యాతి్మక ప్రశాంతత, దైవచింతనను అనుభవిస్తుంటారు. అయితే ఇలాంటివారి కారణంగా భక్తులు ఇబ్బంది పడడమే కాకుండా ఆధ్యాత్మికతను పాడుచేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ను వివరణ కోరగా జరిగిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, దేవస్థానంలో రీల్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీసీ ఫుటేజ్లను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మీడియాకు తెలిపారు.


