తాడేపల్లి : ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై దమ్ము, ధైర్యం ఉంటే మంత్రి నారా లోకేష్ తమతో చర్చకు రావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సవాల్ విసిరారు. లోకేష్ ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు ఇవ్వడం మానేసి, తమ కౌన్సిల్కు వచ్చి చర్చించాలన్నారు. తమ పార్టీ సభ్యులు లేని చోట స్టేట్మెంట్లను ఆపి తమ సభ్యులున్న కౌన్సిల్కు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వాలన్నారు. అప్పుడే వాస్తవాలేంటో ప్రజలకు తెలుస్తాయన్నారు లేళ్ల అప్పిరెడ్డి.
ఈరోజు(సోమవారం, ఆగస్టు 17వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపేంత వరకూ మా పోరాటం ఆగదు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు అమ్ముకున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వటం దుర్మార్గం.
అలా ఇవ్వటం కరెక్టయితే మరి ఆ జీవోలను ఎందుకు రద్దు చేశారు?, తాము తప్పు చేసినట్టు లోకేష్ మాటల్లోనే తేలిపోయింది. శాసనసభలో మంత్రి లోకేష్ మాటల్లోని డొల్లతనం ప్రజలకు అర్థం అయింది. ఉద్యోగాలు అమ్ముకున్న ఆడియో టేపుల మీద విచారణ ఏదీ?, బేరసారాలు చేసిన వారిపై తూతూమంత్రపు చర్యలు తీసుకుంటారా?, ఆధారాలతో సహా మేము చర్చకు సిద్దం. మా పార్టీ నేతలు చర్చకు రమ్మని సవాల్ చేసినా ప్రభుత్వం ముందుకు రావటం లేదు. కౌన్సిల్ లోనైనా చర్చకు రావాలని కోరాం. కానీ కౌన్సిల్కి రాకుండా మంత్రి లోకేష్ తప్పించుకున్నారు’ అని విమర్శించారు.


