సాక్షి,కృష్ణ: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గొల్లపూడి ఫ్లైఓవర్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఒక లారీ, ముందు వెళ్తున్న కారును అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో విజయవాడ గొల్లపూడి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వెస్ట్ బైపాస్ మీదుగా ప్రయాణిస్తుండగా.. బీబీ గూడెం-గొల్లపూడి సమీపంలో వెనుక నుంచి మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన లారీ, వీరి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కారు శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.


