సాక్షి, తాడేపల్లి: టీడీపీ నాయకులు, కార్యకర్తలు తనపై పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తిరిగి బాధితులనే ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27న (నిన్న) ఉండవల్లి వద్ద తనపై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు, ఫొటోలు, ఇతర సాక్ష్యాలతో తాడేపల్లి సీఐకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ రోజు (ఆదివారం) ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఒక ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, సీఐ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తూ బాధితులపైనే నిందలు వేయడం విచారకరమన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజధాని రైతుల ఆహ్వానం మేరకే వెళ్లాం
ఆయన మాట్లాడుతూ..రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మా బృందంపై దాడి చేశారు. నా కారును ధ్వంసం చేయడమే కాకుండా బండరాళ్లు విసిరి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలతో సీఐకి ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోవాల్సింది పోయి మాపైనే నిందలు వేయడం బాధాకరం. ఒక ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే న్యాయం చేయాల్సిన పోలీసులు రాజకీయ నాయకుల్లా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. అని అన్నారు.
దాడి చేసింది టీడీపీ నాయకులే
మాపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ నాయకులే. నా కారుపై రాయి విసిరింది టీడీపీ యువజన అధ్యక్షుడు రాయపాటి కిరణ్, భౌతిక దాడికి పాల్పడింది టీడీపీ మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ. అమరావతికి మేమెప్పుడూ వ్యతిరేకం కాదు. అక్కడ జరుగుతున్న అవినీతికే వ్యతిరేకం. దాడిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా సీఐ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారు. మా ఫిర్యాదును స్వీకరించకపోతే ప్రైవేట్ కేసు వేయడానికైనా వెనుకాడం.
ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం
ఈ దాడి ఘటనను ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే ఈ సీఐని కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుపరుస్తాం. మానవ హక్కుల కమిషన్తో పాటు ఎస్సీ కమిషన్ను కూడా ఆశ్రయిస్తాం. నేను ప్రజాప్రతినిధిని, రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తిని. రాజధానికి వెళ్లే హక్కు నాకు లేదా? మీరు రావద్దని చెప్పినా వచ్చారని సీఐ మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ అన్నారు.


