సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిందని మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణపై ఆయన బుధవారం తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
పోలీస్స్టేషన్లోనే మర్డర్ చేస్తే ఒక్క అధికారి కానీ, మంత్రికానీ అడగలేదు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లి పరామర్శిస్తే గాని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో చెప్పలేని పరిస్థితుల్లో అధికారులున్నారు. ఈఘటనలో చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి. సామాన్యుడి ప్రాణం పోతే పట్టించుకోరా?
సాయికృష్ణ ఘటనకు ఎవరు రాజకీయ రంగు పులిమారు. చంద్రబాబూ.. మిమ్మల్ని ప్రజలు ఖబడ్దార్ అంటున్నారు. మీ పాలన ఎప్పుడు పోతుందో అని ప్రజలు రోజులు లెక్కపెడుతున్నారు.మీరు మోదీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు. రౌడీషీటర్ అని ఆరోపిస్తున్నారు.. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా?.కోర్టులో హాజరు పరిచి శిక్ష విధించేలా చేయండి. సాయికృష్ణ కేసులో ఇవాళ జరిగిందా డొల్ల విచారణే. సీపీ నేతృత్వంలోనే టాస్క్ ఫోర్స్ నడుస్తోంది. విచారణలో సీపీ పేరు రాకపోవడం దుర్మార్గం. కృష్ణలంక పీఎస్ పరిధిలోకి వచ్చే ఏసీపీని మీరెందుకు విచారించలేదు.

17మంది సాక్షులను విచారించామని చెబుతున్నారు. సిట్ అధికారులు ఈ 17మందితోనే ఎందుకు ఆగిపోయారు.సిట్ విచారణలో సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్క సీఐ నాగరాజేనా?. మిగితావారు ఈ కేసులో లేరా?. సీఐ నాగరాజుకు ఎవరు సాయం చేశారు? డెడ్ బాడీని ఎవరు మాయం చేశారు. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?. సిట్ విచారణలో ఈ అంశాలన్నీ ఎందుకు తేల్చలేదు. పీఎస్లో ఫుటేజీ మాయం చేస్తే.. బయటి ఫుటేజీ అయినా ఉండాలి కదా?. అంటే ఎవరూ లేని సమయంలో స్టేషన్లోనే మృతదేహాన్ని పాతి పెట్టారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.


