‘రీ–నీట్‌’ కఠినమే.. | NEET UG-2026 re-examination concluded across the country on 21 June | Sakshi
Sakshi News home page

‘రీ–నీట్‌’ కఠినమే..

Jun 22 2026 5:47 AM | Updated on Jun 22 2026 6:12 AM

NEET UG-2026 re-examination concluded across the country on 21 June

రద్దయిన పరీక్షతో పోలిస్తే క్లిష్టంగా పునఃపరీక్ష ప్రశ్నపత్రం 

బయాలజీ సులభం, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ కఠినం 

రాష్ట్రంలో 73,059 మంది దరఖాస్తు.. 89.09%హాజరు 

గతేడాది తరహాలోనే కటాఫ్‌లు ఉండొచ్చని నిపుణుల అంచనా  

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ యూజీ–2026 పునఃపరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసింది. గత మే 3న జరిగిన తొలి పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ కారణంగా రద్దు కావడంతో, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) రీఎగ్జామ్‌ నిర్వహించింది. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనివిధంగా త్రీటైర్‌ సెక్యూరిటీ, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్, జామర్ల నిఘా నడుమ పరీక్ష జరిగింది. తెలంగాణలో మొత్తం 73,059 మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేయగా, 65,087 (89.09 శాతం) మంది హాజరయ్యారు. తొలి నీట్‌ పరీక్షతో పోలిస్తే రీ–ఎగ్జామ్‌కు హాజరైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష రాసిన విద్యార్థులు, సబ్జెక్ట్‌ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. మే 3న జరిగిన పరీక్షతో పోలిస్తే రీఎగ్జామ్‌ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా, ఎక్కువ సమయం తీసుకునేలా (లెంగ్తీగా) ఉందని వెల్లడైంది. 

కొరవడిన సమతుల్యత: రద్దయిన నీట్‌ పరీక్షతో పోలిస్తే పునఃపరీక్షలో బయాలజీ విభాగం సులభంగానే ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రశ్నలన్నీ నేరుగా ఎన్‌సీఈఆర్టీ పుస్తకాల నుంచే అడిగినట్టు తెలిపారు. కొన్ని అధ్యాయాల నుంచి అసలు ప్రశ్నలే లేవని, అధ్యాయాల పరంగా సమతుల్యత కొరవడిందని సబ్జెక్ట్‌ నిపుణులు భావిస్తున్నారు. స్టేట్‌మెంట్, మల్టిపుల్‌ చాయిస్‌ జతపరచడం వంటి ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చినట్టు తెలిపారు. గత పరీక్షలతో పోలిస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ కొంత కఠినంగానే ఉన్నట్టు నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా ఫిజిక్స్‌ గత రెండు పరీక్షలతో పోలిస్తే చాలా మారిపోయినట్టు పేర్కొన్నారు. గతంలో మోడరన్‌ ఫిజిక్స్, సెమీకండక్టర్‌ నుంచి నేరుగా సిద్ధాంతపరమైన ప్రశ్నలు రాగా, ఈసారి సీన్‌ రివర్స్‌ అయింది. జేఈఈ మెయిన్‌ స్థాయి క్లిష్టత ఫిజిక్స్‌లో ఉందని వెల్లడైంది. 

మెకానిక్స్‌ నుంచి వచ్చిన ప్రశ్నలు జేఈఈ మెయిన్‌ స్థాయిని తాకగా, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ విభాగాల్లో డయాగ్రమ్స్‌ ఇచ్చి, అందులో రెండు మూడు సూత్రాలు ప్రయోగించాల్సినట్టుగా ప్రశ్నలను క్లిష్టతరం చేశారు. దీంతో ఒక్క ఫిజిక్స్‌ విభాగానికి గంటన్నర, ఆపైన కేటాయించాల్సి వచ్చిందని విద్యార్థులు చెప్పారు. ఈసారి స్కోర్, మెరిట్‌ ర్యాంకులను ఫిజిక్స్‌ శాసిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్టీ నుంచి వచ్చాయి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో లెక్కలన్నీ నేరుగా ఫార్ములా ఆధారంగానే ఉన్నాయి. ఇన్‌ఆర్గానిక్‌లో మల్టిపుల్‌ స్టేట్‌మెంట్స్, అస్సెర్షన్‌–రీజన్‌ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడంతో వాటిని చదవడానికి ఎక్కువ సమయం పట్టిందని విద్యార్థులు అన్నారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అత్యంత ఇబ్బందిగా అనిపించిందని నిపుణులు అంచనా వేశారు. డైరెక్ట్‌ ప్రశ్నలు తగ్గించి, రసాయన చర్యల అంతర్గత విధానంపై లోతైన ప్రశ్నలు అడిగారని, దీంతో ఆప్షన్లు చాలా దగ్గరగా ఉండటంతో విద్యార్థులు పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక్కడ నెగిటివ్‌ మార్కుల ఉచ్చులో విద్యార్థులు పడే వీలుందన్నారు.  

కటాఫ్‌ అంచనా ఇలా.. ! 
2025తో పోలిస్తే ఈసారి కూడా నీట్‌ ప్రశ్నపత్రం కఠినంగా ఉండటంతో కటాఫ్‌లు పెద్దగా పెరిగే అవకాశం లేదని నిపుణుల అంచనా. మే నెలలో నిర్వహించిన నీట్‌ ప్రశ్నపత్రం కొంత సులభంగా ఉండటంతో గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు పెరుగుతాయని భావించారు. పునఃపరీక్షతో ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. 2025 తరహాలోనే కటాఫ్‌లు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్‌ ముగిసే సమయానికి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో జనరల్‌ అభ్యర్థులకు 605–610 మార్కుల వద్ద కన్వీనర్‌ సీట్లు వచ్చాయి. ప్రైవేట్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద 540–550 మార్కులు వచ్చిన వారికి చివరి విడతల్లో సీట్లు దక్కాయి. బీసీలకు ప్రభుత్వ కాలేజీల్లో 575–595 మార్కుల మధ్య చివరి సీట్లు కేటాయించబడ్డాయి. ప్రైవేట్‌లో బీసీ విద్యార్థులకు 490–510 మార్కుల వరకు కూడా సీట్లు లభించాయి. ఎస్సీ విద్యార్థులకు కటాఫ్‌ ప్రభుత్వ కాలేజీల్లో 495 – 510 మార్కుల మధ్య, ప్రైవేటులో 435–450 మార్కుల శ్రేణిలో ఉంది. ఈ క్రమంలో ఆయా కేటగిరీల్లో గతేడాది కటాఫ్‌ కంటే 10 నుంచి 20 మార్కులు అదనంగా సాధించిన వారికి ఈసారి కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్లు దక్కే అవకాశం ఉంటుందని అంచనా. 

మొబైల్‌తో పట్టుబడ్డ అభ్యర్థి 
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలకు యత్నించిన అభ్యర్థి పట్టుబడ్డాడు. జండావత్‌ నరేందర్‌ అనే అభ్యర్థి తన మొబైల్‌ ఫోన్‌ను టాయిలెట్‌లోని ఫ్లష్‌ ట్యాంక్‌లో దాచిపెట్టాడు. పరీక్ష సమయంలో టాయిలెట్‌కు వెళ్లి ఆ మొబైల్‌ను ఉపయోగించే ప్రయత్నం చేయగా ఇని్వజిలేటర్లు గుర్తించి, అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా, పరీక్ష నిర్వహణ కోసం హైదరాబాద్‌లోని ఇంటరీ్మడియట్‌ విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కంట్రోల్‌ రూమ్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సందర్శించారు.  
  
ట్రాఫిక్‌ జామ్‌తో పరీక్షకు దూరం 
మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ మండల కేంద్రానికి చెందిన వంజరి అనే విద్యార్థిని ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగే నీట్‌ పరీక్ష రాయడానికి బస్సులో వచ్చింది. అయితే పట్టణంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్‌ జామ్‌ వల్ల ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి 10 నిమిషాలు ఆలస్యమైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమనే నిబంధన వల్ల అధికారులు ఆమెను పరీక్షకు అనుమతించలేదు. పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని తన తల్లితో కలిసి అరగంటపాటు పరీక్ష కేంద్రం వద్దే నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో కన్నీరుమున్నీరైంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement