మచిలీపట్నం జనసేన లోక్ సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఒక అధికారిక సమావేశంలో బందరు మున్సిపల్ కమిషనర్ ను నిలదీసిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎపిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత ఆరాచకపాలన చేస్తున్నదో ఆయన మాటలను బట్టి అర్దం అవుతుంది. మచిలీపట్నంలో జనసేన స్తానిక నేత ఒకరి ఇంటిని మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కూల్చివేయించారు. అందుకు సుమారు 200 మంది పోలీసుల సాయం కూడా తీసుకుని కమిషనర్ ఆ విధ్వంసానికి పాల్పడ్డారట. ఈ విషయాన్ని బాలశౌరి ప్రస్తావించి ఎవరు చెబితే నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చారని, అతనికి దీనివల్ల నలభై లక్షల నష్టం వచ్చిందని సమాధానం ఇవ్వాలని కోరారు మచిలీపట్నం పౌర సమాజం మంచిది కాబట్టి సైలెంట్ గా ఉన్నారని, మరో చోట అయితే ఇంకో రకంగా ఉండేదని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయా అని ఆయన అడిగారు.
అక్కడేమైనా టెర్రరిస్టులు ఉన్నారా. ఇల్లు కూల్చడమన్నది చిన్న విషయం కాదని, ఇద్దరు వ్యక్తుల మద్య ఉన్న ప్రైవేటు తగాదాలో మీరెలా జోక్యం చేసుకున్నారని ఆయనఅడిగారు.మహిళలు కాళ్లమీద పడి బతిమలాడుతున్నా పోలీసులు వినిపంచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకుని ఏమైనా చేశారా.పోలీసుల పాయం కావాలని ఏ ప్రాతిపదికన లెటర్ రాశారు. అదేమి మున్సిపల్ ఆస్తి కాదు కదా అని,ఇంటిలో పెళ్లి చేసుకోవడానికి ఇల్లు కట్టుకుటుంటే దానిని కూల్చుతారా? ఇదేనా ప్రెండ్ లీ ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఎంపీ అడిగినా కమిషనర్ మాత్రం మౌనంగా నిలబడిపోయారు తప్ప జవాబు ఇవ్వలేదు.దాంతో కలెక్టర్ దీనిని తేల్చాలని బాలశౌరి కోరారు. జనసేన కు చెందిన వ్యక్తి ఇంటిని కూల్చడం బందరులో టీడీపీ, జనసేన ల మధ్య రచ్చ రాజుకుంది.
ఈ నేపధ్యంలో బాలశౌరి అధికారిక సమావేశంలో కడిగిపారేయడం చర్చనీయాంశం అయింది. జనసేన కార్యకర్తలు తమకు టీడీపీ నుంచి ఇబ్బంది వచ్చినా మౌనంగా భరించాలన్నట్లుగా పార్టీ అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినా ,బాలశౌరి మాత్రం కార్యకర్తల తరపున మాట్లాడడం ఆసక్తికరమైన అంశమే. ఈ ఇంటిని పడగొడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టూ అడ్డుకోవడానికి యత్నించినా అధికారులు వినిపించుకోలేదు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనల మధ్య పలు చోట్ల ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ఇదే మచిలీపట్నంలో ఒక జనసేన నేత ఏదో వ్యాఖ్య చేశారని ,టీడీపీ స్థానిక నాయకులు అతనిపై దౌర్జన్యం చేసి మోకాలిపై కూర్చోబెట్టిన ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో కలకలం సృష్టించింది.
కొల్లూరు వద్ద జనసేన కార్యకర్తపై టీడీపీ మూకలు దాడి చేశాయట. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే , టీడీపీ వారు పోలీస్ స్టేషన్ లో బీతావహ వాతావరణం సృష్టించారని వార్తలు వచ్చాయి. గతంలో శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత ఒకరికి సంబంధించి వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.అప్పటి నుంచి అనేక చోట్ల ఘటనలు జరగకపోలేదు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ జనసేన తరపున సూటిగా టీడీపీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించడం లేదన్న ఆవేదన జనసేన క్యాడర్ లోను, ఆయన అభిమానులలోను నెలకొంది. మరో విశేషం చెప్పాలి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై లైంగిక వేధింపులు చేశారని, అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చినా ఆయనపై చర్య తీసుకోలేదు. చంద్రబాబును విమర్శిస్తూ వేస్ట్ అని శ్రీధర్ వ్యాఖ్య చేసిన వీడియో బయటకు రాగానే అతని విప్ పదవికి పవన్ రాజీనామా చేయించారు.
ఈ అంశం కూడా జనసేనలో చర్చకు దారితీసింది. అంతేకాదు.పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు అమిత్ షా తో భేటీ అయిన సందర్భంలో వచ్చిన ఒక సమాచారాన్ని ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించడంపై జనసేన కార్యకర్త కేసు పెట్టడం కూడా వివాదంగా మారింది. రాజకీయ అంశాలపై విశ్లేషణలు వచ్చినా, చర్చలు జరిగినా పోలీసు కేసులు పెట్టడం అంటే పార్టీ అంత బలహీనంగా మారిందా అన్న వ్యాఖ్యకు ఆస్కారం ఇచ్చారు. ప్రోఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా కేసు ఎలా పెడతారని అనేక మంది ప్రశ్నించారు. ఇలాంటివాటిపై కేసులు పెట్టవలసి వస్తే ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టవలసి ఉంటుందో కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు గతంలో పొత్తు పెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారంటూ ఆంధ్రజ్యోతి ఓ కధనాన్ని ఇచ్చింది.
అది పవన్ ను బాగా డామేజీ చేసింది. అయినా ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్న వస్తుంది. జగన్ పై అయితే ఎల్లో మీడియా రాసినన్ని కల్పిత కధలు ఇన్నీ అన్నీ కావు. ప్రధాని మోడీని, అమిత్ షాను కలిసిన దాదాపు ప్రతి సందర్భంలోను ,అక్కడ కూర్చుని చూసినట్లు,విన్నట్లు రాసిన స్టోరీలు ఎన్నో ఉన్నాయి. అయినా వైఎస్సార్సీపీ ఎన్నడూ కేసులు పెట్టలేదు.కాని ఇప్పుడు తెలివిగా జనసేనను టీడీపీ ఇరికించి నాగేశ్వర్ పైన,కొన్ని మీడియా సంస్థలపైన టీడీపీ నాయకత్వం కేసులు పెట్టించిందని,దీనివల్ల జనసేనకే తీరని నష్టం వచ్చిందని ఆ పార్టీ వారే బాధపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా నాగేశ్వర్ పై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు సైతం కూటమి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్లపల్లి గ్రామంలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతులను ఎమ్మెల్యే నరేంద్ర అనుచరులు నానా పాట్లకు గురి చేయడంపై ఆందోళన చెలరేగింది.
రైతులు తమ మొక్కజొన్న ఉత్పత్తులను ఒక గోడౌన్ లో దాచుకుంటే అది వైఎస్సార్సీపీ నేత అంబటి మురళీదని ఆరోపిస్తూ దానికి సీల్ వేశారు.అది పెద్ద ఉద్యమంగా మారింది. వైఎస్సార్సీపీ నేతలు పరామర్శకు వెళుతుంటే పోలీసులు అడ్డుకుని నానా రచ్చ చేశారు.తీరా చివరికి ఆ పంట అంతా రైతులదే అని తేలడంతో సీల్ తీయకతప్పలేదు.బాలశౌరి బందరులో జరిగిన ఘటనకే పరిమితం అయినా, వైఎస్సార్సీపీపైన ఈ రెండేళ్లలో జరిగినన్ని దాడులు ఇన్నీ అన్నీ కావు.వైఎస్సార్సీపీ తర్వాత జనసేనపై టీడీపీ రెడ్ బుక్ ప్రభావం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా జనసేన ఎంపీ బాలశౌరి ఈ మాత్రం అయినా ప్రతిఘటించి, గట్టిగా మాట్లాడినందుకు అభినందించాలేమో!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


