
గేదె అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి ఘటన
కుమారుడు, వరసైన చెల్లెలికి తీవ్ర గాయాలు
పిఠాపురం: స్థానిక బైపాస్ రోడ్డులో రాపర్తి జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన మహిళ ఇంటి మమత(32) మృతి చెందింది. పిఠాపురం పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు మమత, ఆమె 8 ఏళ్ల కుమారుడు సుహాస్, చెల్లెలు వరసయ్యే జగ్గంపేటకు చెందిన పెనుమర్తి సోమలత కలిసి మోటారు సైకిల్పై కాకినాడ నుంచి దుర్గాడ వెళ్తున్నారు. రాపర్తి జంక్షన్ వద్ద వారి వాహనానికి గేదె అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పి వారు పడిపోయారు.
ఈ ప్రమాదంలో మమత తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడు, చెల్లెలు తీవ్రంగా గాయపడ్డారు. వీరు కాకినాడ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణ ఎస్సై మణికుమార్ కేసు నమోదు చేశారు. మమత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.