సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో ఓ వైపు తప్పుడు కేసులు, వేధింపులు కొనసాగుతుంటే.. మరోవైపు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో యథేచ్ఛగా నడుస్తున్న దందాల గురించి మాట్లాడారు.
రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది. అమరావతి పేరుతో బిల్డింగ్ల స్కామ్ నడుస్తోంది. విలువైన భూములను కొల్లగొడుతున్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు అందునా కల్తీ మద్యం రాష్ట్రంలో ప్రతీ చోటా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన మరీ దారుణమని వైఎస్ జగన్ అన్నారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో వాటాదారులుగా మారిపోతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో.. మత్తులో పోలీసులే యాక్సిడెంట్ చేసి ప్రజలకు పట్టుబడ్డారు. కారులో గంజాయి, లిక్కర్, ఖాకీ యూనిఫాం దొరికాయి. డ్రైవర్తో సహా మరో ఇద్దరూ పోలీసులు మత్తులోనే ఉన్నారు. సీఐ వచ్చి వీడియోలు తీసే జనాల్ని తీయొద్దని బెదిరించారు. అలాంటప్పుడు ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని, ప్రజలు ఎవరిని నమ్మాలి? అని వైఎస్ జగన్ నిలదీశారు.
పైగా అద్దంకి ఘటనను కవర్అప్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసు అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటనలు చేశారు. వాళ్ల మాటలకు ఎఫ్ఐఆర్కు పొంతనే లేదు(ఈ సందర్భంగా దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధనరాజుల వేర్వేరు స్టేట్మెంట్ల వీడియోలను ప్రదర్శించారు). ఇలాంటి పోలీసులను జైలుకు పంపకుండా.. తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూస్తున్నారు. కూటమి పాలనలో అద్దంకి ఘటనే కాదు.. కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్ కేసులు ఈ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో చెబుతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ హయాంలో గంజాయిని కట్టడి చేశాం. గంజాయి కేసుల్లో 13,210 మంది అరెస్ట్ చేశాం. 11 వేల ఎకరాల్లో గంజాయి పంటల్ని ధ్వంసం చేశాం.ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గిరిజనులను గంజాయి సాగుకి దూరం చేశాం. ప్రత్యేకంగా ఎస్ఐబీని ఏర్పాటు చేశాం అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు.. చంద్రబాబు పాలనలో సర్వం దోపిడీ మయం.. గంజాయి మయం. కూటమి పాలనలో అందరూ కలిసి దందాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబు.. పెదబాబుకి ఇంత అని వాటేలేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఒకే ఒక పంటకు గిట్టుబాటు ధర లభిస్తోంది.. అది గంజాయే అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే!


