
డిసెంబరులో మంజూరు.. నాలుగు నెలలుగా ఖజానాలోనే!
పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లకు రూ.1,121 కోట్లు
ఇంకా స్థానిక సంస్థల ఖాతాలలో జమ చేయని ప్రభుత్వం.. 11 నెలల పాలనలో ఇలా చేయడం వరుసగా మూడోసారి
నిబంధనల ప్రకారం పది పని దినాల్లో బదలాయించాలి..!
కొత్త ఆర్థిక సంవత్సరంలో నెల ముగుస్తున్నా పట్టింపులేదు
ఇతర అవసరాలకు వినియోగించుకుంటూ కాలయాపన
నిధుల కొరతతో స్థానిక సంస్థల్లో పనులు చేయలేని వైనం
కనీసం తాగు నీటి ఇబ్బందులు కూడా తీర్చలేని దైన్యం
పంచాయతీలలో అభివృద్ధి పడకేసింది.. మండల పరిషత్లలో ప్రగతి మందగించింది.. జిల్లా పరిషత్లలో సమస్యలు ముసురుకుంటున్నాయి.. ఏదైనా పని చేద్దామంటే పైసల్లేకుండా పోయాయి..! రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు ఇస్తుందా అనే ఎదురుచూపులతో నాలుగు నెలలు గడిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులొచ్చినా రాష్ట్ర ఖజానా నుంచి బయటకు రావడం లేదు. మరోవైపు స్థానిక సంస్థలకు ఇవ్వకపోయినా పర్లేదు.. అసలు ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని అంటే మాత్రం అనుమానమే అని తెలుస్తోంది.
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలు మండల, జిల్లా పరిషత్ల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,121.20 కోట్లను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నాలుగు నెలలుగా తొక్కిపెట్టింది. ఖజానాలో ఉంచుకుని అవసరాలకు వాడేసుకుంటోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం గ్రామీణ స్థానిక సంస్థల కోసం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకుండా సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల ఆధ్వర్యంలోని స్థానిక సంస్థల పాలక వర్గాలు అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకునే వీలుంటుంది.
స్థానిక గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల తీర్మానాల ప్రకారం చేపట్టే అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల ప్రభుత్వాలే నేరుగా బిల్లులు చెల్లించుకునేలా, రాష్ట్ర ఖజానా ఆంక్షలు లేకుండా స్థానిక సంస్థల ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలులో ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కొత్తగా ఈ విధానం అమలులోకి వచ్చింది.
» 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖలకు విడుదల చేసే నిధులు రాష్ట్ర ఖజానాలో జమయిన పది పని దినాల్లో ప్రభుత్వం స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.
» గత ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.2,152 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. తొలి విడత సెప్టెంబర్లో, రెండో విడతగా డిసెంబర్లో రూ.1,121.20 కోట్లు ఇచ్చింది. (డిసెంబరు 16న రూ.446.48 కోట్లు, డిసెంబరు మూడో వారంలో రూ.674.72 కోట్లను విడుదల చేసింది)
» ఈ నిధులను 70–20–10 నిష్పత్తిన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు వాటి బ్యాంకు ఖాతాలలో జమ చేయాల్సి ఉంటుంది. దీనికి పది పని దినాలు నిర్దేశించింది. అయితే, శనివారం వరకు (ఏప్రిల్ 19) కూటమి ప్రభుత్వం ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయలేదు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేస్తోంది అనే చర్చ అధికార వర్గాలో సాగుతోంది.
» నిబంధనల ప్రకారం వెళ్తే ఆ నిధులను వినియోగించుకునే అవకాశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ కారణంగానే నిధుల జమ విషయంలో కాలయాపన చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
» నిధుల కొరత కారణంగా స్థానిక సంస్థలు తాగునీరు, పారిశుధ్యం సంబంధిత పనులను చేపట్టడం లేదు. పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
11 నెలల్లోనే మూడోసారి..
కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 11 నెలల కాలంలో స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన నిధులను నెలల తరబడి రాష్ట్ర ఖజానాలో ఉంచుకోవడం ఇది మూడోసారి. గతంలో విమర్శలు వచ్చిన తరువాత తప్పనిసరై స్థానిక సంస్థలకు విడుదల చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు రూ.988.76 కోట్లను గత సెప్టెంబర్ లో విడుదల చేయగా, దాదాపు రెండు నెలల తర్వాత నవంబరులో జమ చేసింది.
» 2023–24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన రూ.998 కోట్లనూ ఆలస్యంగా విడుదల చేసింది. రెండో విడతగా గత ఏడాది మార్చి నెలాఖరున కేంద్రం ఇచ్చింది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం జూన్ 12న బాధ్యతలు చేపట్టినా ఆగస్టు దాకా స్థానిక సంస్థలకు ఇవ్వలేదు.
» ఈ అంశంపై ఆగస్టు 13న ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన తర్వాత కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది.