
సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఎస్సీ కులాల రిజర్వేషన్ల ఉప వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ను రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గ్రూప్–1లో రెల్లితో సహా 12 ఉప కులాలకు ఒక శాతం రిజర్వేషన్లు, గ్రూప్–2లో మాదిగలతో సహా 18 ఉప కులాలకు 6.5 శాతం, గ్రూప్–3లో మాలలతో సహా 29 ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్లను 200 రోస్టర్ పాయింట్లతో సహా రాష్ట్రం యూనిట్గా 26 జిల్లాల్లో అమలు చేయనున్నారు. జనాభా గణన అనంతరం జిల్లాల యూనిట్గా అమలు చేస్తారు.
శాసనసభ భవనం రూ.617.33 కోట్లతో, హైకోర్టు భవనం రూ.766.05 కోట్లతో ఎల్–1 బిడ్డర్లకు అప్పగించేందుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం నిర్ణయాలను మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, బాల వీరాంజనేయులు, అనితలు సంయుక్తంగా మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
– ఆర్డినెన్స్ జారీ కాగానే ఎస్సీ వర్గీకరణతో డీఎస్సీ నోటిఫికేషన్.. స్కూళ్లు తెరిచే నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్లు.
– తాత్కాలిక ఖరారు తేదీ మేరకు మే 2వ తేదీన ప్రధాన మంత్రి చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం.
– చేపల వేట నిషేధ సమయంలో భాగంగా మత్స్యకారులకు ఈ నెల 26వ తేదీన రూ.20 వేలు చొప్పున సాయం.
– ఏపీఎండీసీ బాండ్ల జారీ ద్వారా రూ.9,000 కోట్ల రుణ సమీకరణకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులు ఆమోదం. ఏపీఎండీసీ పబ్లిక్ కంపెనీగా మార్పు.
– ఐటీ, డేటా సెంటర్లకు ఎకరం 99 పైసలకే భూమి కేటాయించాలని నిర్ణయం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్తో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపు. ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీ విస్తరణకు ఆమోదం.
– గుంటూరులో ఈఎస్ఐ ఆస్పత్రి, కుప్పంలో కేంద్రీయ విశ్వ విద్యాలయం, నెల్లూరులో పారిశ్రామిక పార్కు, కొత్తవలసలో గ్రేహౌండ్స్ విభాగం, ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయం.
– కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు వివిధ సంస్థలకు గ్రీన్ సిగ్నల్.
కొత్త మైనర్ మినరల్ విధానానికి గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో కొత్త మైనింగ్ విధానానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతన విధానంలో 2022 మార్చి నాటికి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ‘ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్’ ఆధారంగా పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ లీజులు ఏడాది మాత్రమే ఉంటాయి. గ్రానైట్, రోడ్ మెటల్ వంటి బిల్డింగ్ మెటీరియల్స్కు పాత దరఖాస్తు విధానం కొనసాగనుంది. సిలికా శాండ్, డోలమైట్ వంటి ఇండస్ట్రియల్ ఖనిజాలకు ఉత్పత్తితో అనుసంధానించిన ప్రీమియంతో వేలం విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. పట్టా, డీకేటీ, అటవీ భూములపై దరఖాస్తుల ద్వారా లీజుల మంజూరు కొనసాగుతుంది. డెడ్ రెంట్లు ఇక నుంచి త్రైమాసికంగా కాకుండా వార్షికంగా సీనరేజి ఫీజుపై సర్దుబాటు చేయనున్నారు.
కొత్తగా మంజూరు చేసే గ్రానైట్, ఇండస్ట్రియల్ మినరల్ లీజులు 20 నుంచి 30 ఏళ్లకు పెంచారు. రోడ్ మెటల్ (క్యాప్టివ్ క్రషింగ్ యూనిట్ల కోసం) లీజులు 15 నుంచి 30 ఏళ్లకు, మిగిలిన ఖనిజాల కోసం 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. కొత్త విధానంలో టన్నేజి ఆధారంగా సీనరేజి ఫీజు వసూలు చేస్తారు. లీజు దరఖాస్తు నుంచి సర్దుబాటు, బదిలీ, పునరుద్ధరణ, ఫిర్యాదుల వరకు అన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్లో చేయనున్నారు. గతంలో పెండింగ్లో ఉన్న లీజు వివాదాలను పరిష్కరించేందుకు ఓటీఎస్ (వన్టైమ్ సెటిల్మెంట్) పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఎస్వీ గోశాలపై తప్పుడు ప్రచారం
ఎస్వీ గోశాలపై వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మంత్రులు అనిత, రామానాయుడు అన్నారు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షకు విద్యార్థులు వెళ్లేందుకు ఆలస్యం అయిందనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.