మా నాన్న తప్పు చేయడు.. ఎవరైనా చేస్తే ఒప్పుకోడు | Kakani Govardhan Reddy Daughter Poojitha Inteview | Sakshi
Sakshi News home page

మా నాన్న తప్పు చేయడు.. ఎవరైనా చేస్తే ఒప్పుకోడు

Jun 23 2025 12:24 PM | Updated on Jun 23 2025 1:07 PM

Kakani Govardhan Reddy Daughter Poojitha Inteview

బూటకపు కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు  

సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారు 

అక్రమ కేసుల్లో కాకాణి పేరు చెప్పమని పోలీసులు వేధిస్తున్నారు 

అన్నింటిని ఆ దేవుళ్లే చూస్తున్నారు.. వారే శిక్షిస్తారు 

  ‘సాక్షి’తో మాజీమంత్రి కాకాణి తనయ పూజిత

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  ‘నేను గట్టిగా నమ్ముతున్నాను. మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదని. చేయని తప్పులకు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. బెయిల్‌ రాకుండా రోజుకో కేసు తెరపైకి తెచ్చి వేధిస్తున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నను దగ్గరగా చూస్తున్నాను. ఆయన ఏ తప్పు చేయడు. తప్పు చేసిన వారు ఎవరైనా ఒప్పుకోడు. అలాంటి ఆయనపై అక్రమ కేసులు పెడుతున్నారు. అన్నింటిని ఆ భగవంతుడే చూస్తున్నాడు. నాన్నపై కుట్ర పన్ని తప్పులు చేసిన వారు, చేయిస్తున్న వారిని భగవంతుడే శిక్షిస్తాడు. నాన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని నేను నమ్ముతున్నాను’ వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తనయ కాకాణి పూజితతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.

మీ నాన్న అరెస్ట్‌ తర్వాత మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి? 
 కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశి్నస్తున్నారని మానాన్నపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌లో ఉంచారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నను వదిలి ఉండలేదు. ఎప్పుడు ఆయనతోనే ఉండేవాళ్లం. నాకు వివాహం అయి తొమ్మిదేళ్లు. అప్పుడే నా ఇద్దరు బిడ్డలు నా వద్దే ఉండాలని చెప్పి చేశారు. నాన్నను చూడకుంటా ఒక్క రోజు కూడా ఉండలేదు. అలాంటిది మూడు నెలలుగా నాన్నకు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది?. 80 ఏళ్ల మా నాన్నమ్మ నా బిడ్డ ఏం తప్పు చేశాడని జైల్లో పెట్టారని ప్రశి్నస్తుంటే ఆమెను ఓదార్చలేకపోతున్నాం. మా పిల్లలు తాతయ్య ఎక్కడని రోజూ ఏడుస్తున్నారు. పిల్లలు వాళ్ల తాతయ్యను వదిలి ఉండలేదు. మా నాన్న మనస్తత్వం తెలిసిన నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన తప్పు చేయడు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జంకడు. ఆయన్ను ఒక రాజులా చూశాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన్ను చూడలేకే ములాఖత్‌కు వెళ్లడం లేదు.

కాకాణిని జైల్లో పెట్టడంతో పార్టీ కేడర్‌ పరిస్థితి ఏమిటి? 
మూడు నెలలుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మా నాన్న దూరంగా ఉన్నారు. అయినా పార్టీ కేడర్‌ ఏమీ భయపడడం లేదు. నా తండ్రి అందుబాటులో లేకపోయినా.. ఆయన బిడ్డగా నేను పార్టీ కేడర్‌కు అండగా నిలబడి ధైర్యం చెబుతున్నాను. అందరికి మంచి చేసిన మా నాన్నను జైల్లో పెట్టడంతో పార్టీ కేడర్‌ మొత్తం కసితో ఉన్నారు. వారే ముందుకు వచ్చి మాకే ధైర్యం చెబుతున్నారంటే ఆయన వారిపట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

పార్టీ కేడర్‌ను వేధిస్తున్నారన్న సమాచారం ఎంత వరకు నిజం? 
కూటమి ప్రభుత్వ పెద్దలు ఆదేశాలతో పోలీసులు మా నాన్న గోవర్ధన్‌రెడ్డిపై ఇప్పటికే చాలా అక్రమ కేసులు పెట్టారు. రోజుకో కేసు పెడుతున్నారు. ఆధారాలు లేని ఆ కేసుల్లో నాన్న పేరు చెప్పాలని పార్టీ కేడర్‌ను పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్ల టార్చర్‌ భరించలేకపోతున్నట్లు కొందరు నాకు ఫోన్‌ చేసి అమ్మా మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టి సంతకాలు తీసుకుంటున్నారు అని చెబుతుంటే బాధగా అనిపిస్తుంది. నాన్న ఒక్కడిని ఇబ్బంది పెట్టడం కోసం ఇంత మందిని హింసించడం చూస్తే నా మనస్సు చలిస్తుంది. నాన్న వెంట నడిచిన నేతలందరిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు.

భవిష్యత్‌ ప్రణాళిక ఏమిటి? 
మా కుటుంబం విలువలతో కూడిన రాజకీయం చేసింది. మా తాతయ్యకు ఇప్పటికి మంచి పేరు ఉంది. మా తాత విలువలకు వారసుడిగా రాజకీయ చేస్తున్నారే కానీ.. ఏనాడు తెలియక కూడా తప్పు చేయలేదు. జెడ్పీ చైర్మన్‌గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఎవరికి అన్యాయం చేయలేదు. తప్పు చేసిన వారిని రాజకీయ కోణంలోనే ఆ తప్పులను ఎత్తి చూపి విమర్శలు చేశారనే కానీ, అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయలేదు. మా నాన్న ఏ తప్పు చేయలేదు కాబట్టి కచ్చితంగా కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. అంత వరకు మా నియోజకవర్గంలోని మా పార్టీ కార్యకర్తలకు నేను అండగా ఉంటానని చెప్పాను.  

Advertisement
 
Advertisement
Advertisement