సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు యానాంలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో వేకువజాము నుంచి దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల ధాటికి బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ముఖ్యంగా బెంజిసర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ స్థాయిలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏలూరు రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనూ శనివారం వేకువజామున భారీ వర్షం కురిసింది. ఉ.8 గంటల వరకు జిల్లాలో సగటున 37.4 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.

పి.గన్నవరంలో అత్యధికంగా 60.0 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ పంచాయతీ గంగవరం వద్ద గిరిజనులు నిర్మించుకున్న తాత్కాలిక తూరల వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఒడిశా వైపు వెళ్లే మార్గంలో సుమారు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
ఇదీ చదవండి: చవితి పూట.. ధరల మంట


