
సాక్షి, విశాఖపట్నం: రానున్న 24 గంటల్లో ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, కృష్ణ, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తరాంధ్ర తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాతావరణం.. రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారింది. నిన్న గుడివాడలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. కైకలూరు, మచిలీపట్టణం 7, ఏలూరు 6, నూజివీడు, భీమడోలు, రేపల్లె 5 సెంటీమీటర్ల, లేపాక్షి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.