సాక్షి, విశాఖపట్నం: తాను మహిళలపై ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదని.. తనను రెచ్చగొట్టిన వ్యక్తిపై మాత్రమే విమర్శలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్ఘాటించారు. తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్కు వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
ఏ పరిస్థితుల్లో తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో మహిళా కమిషన్కు పూర్తిగా వివరిస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తినే విమర్శించానని చెప్పారు.
"ప్రతి మనిషికి ఒక సహనం ఉంటుంది. ఆ సహనం కోల్పోయేలా ఎదుటి వ్యక్తులు మాట్లాడకూడదు. నా వ్యాఖ్యలను మహిళలకు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారే నవ్వులపాలయ్యారు" అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా అమర్నాథ్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, అలాంటి ఘటనలపై మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సాయి కృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్కు కనిపించలేదా? అని ప్రశ్నించిన ఆయన.. నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపై కూడా మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
తనపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి మహిళా కమిషన్కు పూర్తి వివరణ ఇస్తానని, తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ వివాదంగా మార్చారని అమర్నాథ్ అన్నారు. మహిళా కమిషన్ ఎదుట ఆయన ఇవ్వబోయే వివరణ, అనంతరం కమిషన్ స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


