నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల కండువాలు ధరించి నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్సీలు
మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీల ధ్వజం
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి సంఘీభావం
నెల్లూరు (వేదాయపాళెం): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందని, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులకు పాల్పడుతోందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, డీఎస్సీలో జరిగిన అవకతవకలను, ఎత్తిచూపుతున్నారనే ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థల్లో దాడులు చేయడంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 18 మంది శాసన మండలి సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు చంద్రశేఖరరెడ్డికి సంఘీభావంగా నెల్లూరుకు తరలివచ్చారు.
నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సర్కారు దమన నీతిని ఎండగట్టారు. చిల్డ్రన్స్పార్కు రోడ్డులోని చంద్రశేఖర్రెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ర్యాలీగా వీఆర్సీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిరంకుశ, నియంతృత్వ పోకడలు మంచివి కాదన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలను తగిన సాక్ష్యాధారాలతో ఎత్తిచూపినందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై అర్ధరాత్రి దాడులు నిర్వహించారని విమర్శించారు.
ఈ జిల్లాలో నారాయణ విద్యాసంస్థలు, హాస్టళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని, వాటిపై దాడులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఎంవీ రామచంద్రారెడ్డి, కల్పలతరెడ్డి, కేఆర్జే భరత్, ఇషాక్బాషా, పి.రామసుబ్బారెడ్డి, మంగమ్మ, రమేష్ యాదవ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేరిగ మురళీధర్, తూమాటి మాధవరావు, ఎండీ రుహుల్లా, కవురు శ్రీనివాస్, వెంకటరవీంద్రనాథ్, బొమ్మి ఇజ్రాయిల్, కె హరిబాబు, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రాష్ట మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పాల్గొన్నారు.


