
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్: విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా మహోత్సవాల ఆహా్వన పత్రికలను బుధవారం వేర్వేరుగా అందజేశారు. విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు, శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో డి.పెద్దిరాజు కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.
అనంతరం ఆలయాల అర్చకులు వేద ఆశీర్వచనం పలకగా, ఈవో, చైర్మన్లు స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డికి విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఆహా్వన పత్రిక అందజేశారు.
శ్రీశారదాపీఠాధిపతులకు శ్రీశైలం నవరాత్రుల ఆహ్వానం
సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానంలో జరిగే భ్రమరాంబికాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహా్వన పత్రికను విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతికి బుధవారం అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొనాలని దేవస్థానం పండితులు, అధికారులు కోరారు. ఫిబ్రవరిలో చేపడుతున్న ఆలయ కుంభాభిషేకం గురించి వివరించారు. వైదిక, ఆగమ పద్ధతులను కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజుకు స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు.